ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి Justice Yashwant Varma ఇంట్లో నోట్ల కట్టలు బైటపడ్డాయి. అయితే ఈ నోట్ల కట్టలు ఏదో ACB, ED, DRI దాడుల్లో దొరకలేదు. “ప్రమాదవశాత్తు” బైటపడ్డాయి. ఈ నెల 14న జస్టీస్ వర్మ గారింట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆయన ఇంట్లోలేరు. అగ్నిమాపక శాఖకి ఫిర్యాదు చేసినంతనే వారొచ్చి మంటలు ఆర్పారు. ఆ సందర్భంలో ఒక గదిలో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు బైటపడ్డాయి. అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ నోట్ల కట్టల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మంతా లెక్కల్లో చూపని నగదుగా నిర్ధారించారు. దీంతో సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టీస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో కొలీజియం స్పందించి జస్టీస్ యశ్వంత్ వర్మని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసింది.
గతంలో జస్టీస్ వర్మ అలహాబాద్ లోనే పనిచేసి 2021లో ఢిల్లీకి వచ్చారు. “కేవలం బదిలీతోనే న్యాయ శాఖ ఇమేజ్ తిరిగిరాదు” అని ఐదుగురు సభ్యుల కొలీజియం అభిప్రాయం వ్యక్తం చేసింది. వర్మని రాజీనామా చేయమని అడగటమో లేదా ఒక కమిటీని నియమించి అంతర్గత విచారణ చేయడమో చేయాలని కొలీజియం భావించింది. ఈ మొత్తం ఉదంతం న్యాయవర్గాల్లో సంచలనం రేకెత్తించింది.
న్యాయాన్ని కాపాడాల్సిన, అవినీతిని నిర్మూలించాల్సిన పవిత్రమైన బాధ్యతలో వుండి జస్టీస్ వర్మ ఇంట్లోనే లెక్కలు చెప్పని కోట్లాది రూపాయల నోట్ల కట్టలు దొరకడం కంచే చేను మేసిన చందంగా వుందని ప్రజలు అనుకుంటున్నారు.