మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన సంఘటనలో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు ‘విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది. మరో 30 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. నిర్మాణసంస్థ L&T పై కూడా చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలిసింది.
2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజ్ కుగింది. దీంతో ఏడో బ్లాక్ తో పాటు కొన్ని పియర్స్ దెబ్బతిన్నాయి. NDSA నిపుణుల కమిటీ పరిశీలించి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్లో వైఫల్యాల వల్ల దెబ్బతిన్నట్లుగా గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో ప్లానింగ్ నుంచి నిర్వహణ వరకు లోపాలు ఉన్నట్లుగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) గుర్తించింది. మేడిగడ్డ బ్యారేజ్ లోని ఏడో బ్లాక్ కూల్చాల్సిందేనని ఇప్పటికే సిఫార్సు చేసిన ఎన్డీఎస్ఏ మళ్లీ నిర్మించాలని సూచించింది. అయితే ఈ బ్లాకును మళ్లీ నిర్మించేందుకు అవసరమైన డిజైన్ను రూపొందించే బాధ్యతను కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) అప్పగించాలని సూచించినట్టుగా తెలుస్తోంది.
విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కూడా నివేదికను అందించింది. ఇందులో ఏకంగా 17 మంది సీనియర్ ఇంజినీర్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసింది. వీరందరూ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో పాల్గొన్నవారే. నిర్మాణంతోపాటు డిజైన్లు, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో పనిచేసిన ఇంజినీర్లు ఉన్నారు. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుతోపాటు గతంలో ఎస్ఈగా పనిచేసిన రమణారెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తిరుపతిరావు మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటూ మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజినీర్ సుధాకర్రెడ్డిలాంటి వారిపై చర్యలకు సాఫిర్స్ చేసినట్లు సమాచారం. అయితే వీరిపై క్రిమినల్ చర్యలా, శాఖాపరమైనవా అన్నది మాత్రం తెలియడం లేదు. ఇక మరో కొంతమందిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్స్ చేసింది విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్. ఇందులో డీఈఈలు, ఏఈఈలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కొంత మంది ప్రయోషన్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు వారిమీద చర్యలకు సిఫార్స్ చేయడంతో వారి పదోన్నతులను పరిశీలనకు తీసుకోవాలా లేదా అన్న దానిపై నీటిపారుదలశాఖ ఆలోచిస్తోంది.