కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం MP Shashi Tharoor BJP లో చేరనున్నారా? ఈ ప్రశ్నకి అవుననే సమాధానమే వస్తుంది. అందుకు తగ్గట్టుగా ఖచ్చితమైన సంకేతాలు వస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కడంలేదని, పార్టీలో తాను పోషించాల్సిన పాత్ర గురించి స్పష్టత లేదని, దీంతో ఆయన అసంతృప్తిగా వున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య BJP నాయకుడు జై పాండాని ఆయన కలవడం, అలా కలిసిన ఫోటోని వైరల్ చేయడం కావాలనే జరిగిందని, ఆయన పార్టీని వీడనున్నారని అనడానికి ఇది స్పష్టమైన సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.
అద్భుతమైన వాగ్ధాటికి, అసాధారణ లోకజ్ఞానానికి, ఇంగ్లీషులో అసమాన్య పాండిత్యానికి పెట్టింది పేరైన శశిథరూర్ నాలుగుసార్లు తిరువనంతపురం లోక్ సభ స్థానం నుండి MP గా ఎన్నికయ్యారు. కొంతకాలం నుండి ఆయనకి కాంగ్రెస్ అధినాయకత్వంతో సరిపోవడం లేదని సంకేతాలు వస్తున్నాయి. గతంలో భారత్ తరపున యునైటెడ్ నేషన్స్ లో అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఆయన తన సామర్ధ్యాల్ని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నదని భావిస్తున్నారు. 2022లో జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన మల్లిఖార్జున ఖర్గే చేతిలో ఓడిపోయారు. తన సామర్ధ్యానికి తగిన గుర్తింపు లభించనందున ఆయన అసంతృప్తిగా వున్నారని విశ్లేషకుల అంచనా.