హమ్మయ్య! ఎట్టకేలకు పోసాని Posani Krishnamurali బెయిల్ లభించింది. సుమారు గత నెలరోజులుగా ఒక కేసు తరువాత మరో కేసుకింద బుక్కవడంతో పోసాని APలో జైళ్లయాత్ర చేస్తూ వచ్చారు. ఒక కేసులో రిమాండ్ పూర్తవగానే మరో కేసులో ఆయన కోసం డిమాండ్ వచ్చేది. వివిధ జిల్లాల పోలీసులు ఆయన కోసం క్యూ కట్టారు. అలా పోలీసులు మొత్తం ఆయన్ని రెండువేల కిలోమీటర్ల దూరం తిప్పారు. చివరకు CID నమోదు చేసిన కేసులో బెయిల్ దొరకడంతో ఆయన గుంటూరు జెయిల్ నుండి విడుదలయ్యారు.
YCP అధికారంలో వున్నప్పుడు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసి మార్ఫ్ చేసిన ఫోటోల్ని ప్రదర్శించారనే అభియోగాల మీద పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు బుక్కయ్యాయి. ఈ క్రమంలో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు గత ఫిబ్రవరి 26న హైదరాబాద్ లో ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇంక అక్కడి నుండి ఆయన్ని రాష్ట్రంలోని వివిధ జిల్లాల పోలీసులు రాష్ట్రమంతా తిప్పారు.
YCP అధికారంలో వుండగా పోసాని చాలా దూకుడుగా మీడియాలో అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగానూ, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగానూ వీడియోలు తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేవారు. ఆయన స్వామిభక్తిని మెచ్చుకొని ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా అప్పటి ప్రభుత్వం నియమించింది. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోసాని రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు, తాను ఇకమీదట ఎవరిమీద ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలు చేయబోనని ప్రకటించారు. కానీ “చేసిన కర్మము చెడని పదార్ధము” అని వాగ్గేయకారుడు అన్నట్లు ఆయన వివిధ కేసుల్ని ఎదుర్కొన్నారు.