హైద్రాబాద్: పర్యావరణ అనుకూలమైన హరితభవనాలకు ఆదరణ పెరుగుతోంది. అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలే కాదు ప్రభుత్వం నిర్మించిన సచివాలయం, పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, జిల్లా కలెక్టరేట్లు, ఇతరత్రా ఆఫీసు భవనాలు సైతం పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తుండటమే ఇందుకు ఉదాహరణ. స్వచ్ఛమైన గాలి, వెలుతురు రావడంతో పాటు సహజవనరులను వినియోగించుకోవడం, విద్యుత్, నీటి పొదుపు, సౌరశక్తి వినియోగం, గృహెూపకరణాలు సైతం Indian Green Building Council (IGBC) అనుగుణంగా ఉండటమే హరితభవనాల ప్రత్యేకత.
గ్రీన్ బిల్డింగ్స్ 60 శాతం వరకు నీటి వృథాను అరికట్టవచ్చు. నిత్యావసరాలకు వినియోగించే నీరు బయటకు పంపకుండా వాటిని రీసైకిల్ చేసి తిరిగి మొక్కలు, బాత్రూమ్ అవసరాలకు వాడుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేస్తారు. సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణ వ్యయం 8-10 శాతం అధికంగా ఉంటుంది. కానీ.. ఈ భవనాలలో నీరు, విద్యుత్ పొదుపు అవుతున్న కారణంగా ఇంటి నిర్మాణం కోసం అదనంగా వెచ్చించిన వ్యయం 2-3 ఏళ్లలో తిరిగి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంటి నిర్మాణ సమయంలోనే రీసైకిల్ మెటీరియల్ ను ఉపయోగించడం గ్రీన్ బిల్డింగ్స్ మరొక ప్రత్యేకత. పర్యావరణానికి హానిచేయని ఉత్పత్తులనే నిర్మాణంలో వాడుతుంటారు. ఇటుకల నుంచి టైల్స్ వరకు గ్రీన్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో 720కి పైగా గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్లు IGBC వద్ద రిజిస్టర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా 11 వేల నిర్మాణాలు ఉన్నాయని IGBC ప్రతినిధులు చెబుతున్నారు.
Indian Green Building Council (IGBC) ను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) 2001 లో ఏర్పాటు చేసింది. ఈ కౌన్సిల్ భారతదేశంలో మొట్టమొదటి ప్లాటినం రేటింగ్ పొందిన గ్రీన్ బిల్డింగ్ మరియు నెట్ జీరో ఎనర్జీ బిల్డింగ్ అయిన హైదరాబాద్లోని CII-Sohrabji Green Business Centre నుండి వచ్చింది. ‘అందరికీ స్థిరమైన నిర్మాణ వాతావరణాన్ని’ కల్పించడం ఈ కౌన్సిల్ యొక్క దృష్టి.