ఖుద్స్ దినోత్సవం సందర్భంగా, ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఇజ్రాయెల్ వ్యతిరేక, పాలస్తీనా అనుకూల నిరసనలు చెలరేగడంతో, జమ్మూ కాశ్మీర్ పోలీసులు శుక్రవారం (మార్చి 28) UAPA చట్టం కింద గుర్తుతెలియని నిరసనకారులపై కేసు నమోదు చేశారు. బీర్వాలో జరిగిన ఇలాంటి నిరసనకు సంబంధించి, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 126(2) (తప్పుడు నిర్బంధం), 189(6) (చట్టవిరుద్ధ సమావేశం) కింద బుద్గాం జిల్లా పోలీసులు ప్రత్యేక కేసు నమోదు చేశారు.
కొనసాగుతున్న ఇస్లామిక్ మాసం రంజాన్ చివరి శుక్రవారం నాడు, జరుపుకునే ఖుద్స్ దినోత్సవాన్ని కాశ్మీర్, లడఖ్లోని వివిధ ప్రాంతాలలో, పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక, అమెరికా వ్యతిరేక నిరసనలు జరిగాయి. దీనికి మహిళలు, పిల్లలతో సహా వేలాది మంది హాజరయ్యారు. బారాముల్లా జిల్లాలోని పట్టన్ ప్రాంతంలోని చైనబాల్లో జరిగిన అలాంటి ఒక నిరసన కార్యక్రమంలో, కొంతమంది ప్రదర్శనకారులు హిజ్బుల్లా జెండాలను ఊపుతూ కనిపించగా, మరికొందరు గత సంవత్సరం హత్యకు గురైన లెబనీస్ మతాధికారి, హిజ్బుల్లా కమాండర్ హసన్ నస్రల్లా ఫోటోలను కలిగి ఉన్న ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. గత సంవత్సరం అక్టోబర్ లో ఇజ్రాయెల్ దళాలతో జరిగిన ఘర్షణలో మరణించిన, పాలస్తీనియన్ రాజకీయ నాయకుడు, హమాస్ మాజీ చైర్మన్ యాహ్యాసిన్వర్తో కూడిన ప్లకార్డులను, ఇతర నిరసనకారులు ప్రదర్శించారు.
ఈ నిరసనకు సంబంధించి, పట్టాన్ పోలీస్ స్టేషన్లో UAPA (FIR No 49/2025) కింద కేసు నమోదు చేసినట్లు, అధికారి తెలిపారు. అయితే, ఉగ్రవాద నిరోధక చట్టంలోని ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయబడిందో, పోలీసులు వెల్లడించలేదు. ఎక్కడో ఇజ్రాయెల్, పాలస్తీనాకి సంబంధించిన విషయంలో, ఇక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తే, అది ఉగ్రవాదమెలా అవుతుందో, పోలీసులు, ప్రభుత్వం వివరించాలి. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న ప్రదర్శనకారులపై కేసు పెట్టడం, వారి వాక్ స్వాతంత్ర్యంపై జరుగుతున్న దాడిగానే భావించాలి.