ఉగాది పండుగతో చైత్రమాసం ప్రారంభమవుతుంది. వసుధపై వసంతం వికసించిన తొలిరోజు ఉగాది. మిగిలిన పండుగల కన్నా ఉగాది ఎంతో ప్రత్యేకమైంది. సాధారణంగా పండుగలన్నీ ఏదో ఒక దేవత లేదా దేవుడికి సంబంధించి ఉంటాయి. ఉగాది ఇందుకు పూర్తి భిన్నం. ఏ దేవుడి పేరూ ఈ పండుగ రోజు వినిపించదు. ఉగాది కాలానికి సంకేతం. మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ఆనందవేళ ఉగాది. కాలాన్ని గుణిస్తూ, మారుతున్న కాలానికి (రుతువులకు) అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుంది. సహనానికి, వ్యక్తిత్వ వికాసానికి, మనోవికాసానికి ఆలవాలంగా నిలుస్తుంది. అంతేకాదు, ఎన్నో వైజ్ఞానిక అంశాల సమాహారంగానూ ఉగాది తన ప్రత్యేకతను చాటుతుంది.
ప్రతి మనిషిలోను శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే తన్మాత్రలుగా పంచభూతాలు అంతర్లీనంగా ఉంటాయి. ఇవే పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే రూపాల్లో బాహ్యంగా ప్రకటితమవుతాయి. ఇలా అంతర్బాహ్య రూపాల్లో ఉన్న పంచభూతాలను మనో నేత్రంతో దర్శించి, లౌకిక జీవనాన్ని సాఫల్యం చేసుకుంటూనే కైవల్యానికి సోపానాలు నిర్మించుకోవాల్సిన బాధ్యత మనిషిపై ఉంది. దైనందిన జీవనంలోని ప్రతి అడుగులో ప్రకృతిని అనుసరిస్తూ, ప్రకృతి, శక్తుల మేలు కలయికగా జీవన లక్ష్యాన్ని చేరుకోవాలనేది మన ప్రాచీనుల దిశానిర్దేశం. ఈ బాధ్యతల నిర్వహణలో మనిషికి చేయూత అందించేందుకు సర్వోపద్రష్టలైన మన ప్రాచీనులు ‘కాలవిభజన’ చేశారు. ఈ క్రమంలో భారతీయ జీవనంలోని అత్యున్నత వైజ్ఞానిక కోణం సమున్నతంగా ఆవిష్కృతం అవుతుంది.
ఆశలు చిగురుల వంటివి. అవి ఎప్పుడూ వికసిస్తూ ఉండాలి. అలా కోరుకోవటమే నిత్య వసంతం అవుతుంది. ఎల్లప్పుడూ మంగళధ్వనులు వినాలనే తపనకు ప్రతిరూపమే కోకిల కూత. ఈ విధంగా ఉగాది పండుగ మనిషి జీవనంలో కీలకంగా, మూలకంగా ఆవిర్భవించింది. ఉగాది పండుగ పునరుజ్జీవనానికి సంకేతం. అప్పటివరకు మోడుబారిన చెట్లు, తీగలు ఉగాది రాకతో మళ్లీ చిగురించి పూలు, కాయలతో కళకళలాడినట్టు కష్టనష్టాలతో కుంగిపోతున్న మనిషి జీవితం ధైర్యంతో, ఆశతో ముందుకుసాగాలనే సందేశాన్ని అందిస్తుంది. ఇదంతా ఉగాది పండుగలోని సామాజిక విజ్ఞానం.


