దాదాపు తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయి, ఎటకేలకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా గత నెల 19న భూమ్మీదకు చేరుకున్న సునీత విలియమ్స్. తనకు అవకాశం వస్తే స్టార్లైనర్ ద్వారా మళ్లీ అంతరిక్షంలోకి వెళ్ళతానని అన్నారు. సునీతతో పాటు భూమ్మీదకు చేరుకున్న మరో ఇద్దరు వ్యోమగాములు బుచ్ విల్మోర్, నిక్ హేగ్ నాసా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్లో మాట్లాడారు.
సునీత మాట్లాడుతూ, తాను స్పేస్లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం కోసం అందరూ ఆందోళన చెందారని, ఇప్పుడు తాను ఎంతో బాగున్నానని, భూమికి తిరిగి వచ్చాక మూడు మైళ్లు పరిగెత్తానని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న మిషన్ కంట్రోల్ బృందాలు తమకు భూమి పైకి తిరిగి రావడంలో, పునరావాసం మరియు కొత్త సవాళ్లను ఎదుర్కోవడంలో ఎంతో సహాయం చేశాయన్నారు. తాను నార్మల్ అవడానికి సహాయం చేసిన సహాయక బృందాలకు ఆమె కృతజ్ఞతలు తెలియచేశారు.
స్పేస్ నుండి భూమి ఎలా కనిపించిందని అడిగితే, అద్భుతంగా కనిపించిందని అన్నారు. ముఖ్యంగా హిమాలయాలు మరింత అద్భుతంగా కనిపించాయన్నారు. తన తండ్రి జన్మించిన భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని, భారత్ మూలాలు కలిగి ఉండడం వల్ల గర్వంగా ఉందని తెలిపారు.