APలో తొలి బర్డ్ ఫ్లూ వైరస్ మృతి
పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండు సంవత్సరాల చిన్నారి బర్డ్ ఫ్లూ H5N1 వైరస్తో మృతిచెందింది. భారత వైద్య పరిశోధన మండలి (ICMR) మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) నిర్ధారించినట్లుగా, చిన్నారి పచ్చి కోడిమాంసం తినడం, అలాగే రోగ నిరోధక శక్తి తగ్గడమే ఈ మృతికి కారణమైందని వైద్యులు తెలిపారు.
బర్డ్ ఫ్లూ కారణంగా జరిగిన ఈ మృతి రాష్ట్రంలో తొలి ఘటన. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, మూర్ఛ, విరేచనాలు, ఆహారం తినలేని లక్షణాలు కనిపించిన తర్వాత, మార్చి 4న నరసరావుపేట చిన్నారిని మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎయిమ్స్ వైద్యులు చిన్నారికి ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించినా, మార్చి 16న ఆమె మృతి చెందింది.
చికిత్స ప్రారంభించిన సమయంలో, మార్చి 7న పాప గొంతు, ముక్కు నుండి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్లోని VRDLలో పరీక్షించినప్పుడు, బర్డ్ ఫ్లూ అనుమానంతో నమూనాలను మార్చి 15న ఢిల్లీకి పంపారు. అక్కడ కూడా బర్డ్ ఫ్లూ వైరస్ అనుమానం తేలింది. దీనిని గమనించిన ICMR, మార్చి 24న శాంపిల్స్ను పూణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించింది. అనంతరం, ఈ రెండు ల్యాబ్స్లో చేసిన పరీక్షల ద్వారా, చిన్నారికి H5N1 వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
ఈ మరణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మృతిచెందిన చిన్నారి ఇంటి చుట్టూ ఆరోగ్యశాఖ సర్వే నిర్వహించింది. అనుమానిత లక్షణాలు ఉన్నవారు ఎవరూ లేరని నిర్ధారించారు.
ఇంట్లో చికెన్ కర్రీ వండుతున్న సమయంలో పాప పచ్చి మాంసం ముక్క తినడం, అదే ప్రమాదం కారణమైందని తల్లిదండ్రులు తెలియజేశారు. ఉడికించిన మాంసం తిన్న తమకు ఎలాంటి సమస్యలు రాలేదని వారు పేర్కొన్నారు.


