విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో BCలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను పార్లమెంట్ ఆమోదించి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు BC సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. న్యూఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద BCల పోరుగర్జన, మహాధర్నా కార్యక్రమాన్ని బుధవారం చేపడతాయి. BC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ CM భట్టి విక్రమార్క, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, DMK MP కనిమొళి, MIM MP అసదుద్దీన్, YCP, BRS MP వద్దిరాజు రవిచంద్ర, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, MLC కోదండరాం, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, CPI జాతీయ కార్యదర్శి K. నారాయణ, పలువురు MPలు, MLAలు, 29 రాష్ట్రాల OBC ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
తెలంగాణ భవన్లో మంగళవారం విలేకరులతో మాట్లాడిన BC రిజర్వేషన్ల బిల్లులకు తెలంగాణ అసెంబ్లీలో BJP మద్దతు పలికిందని, కానీ BCల్లో ముస్లిములు ఉన్నందున బిల్లులను అడ్డుకోవాలని కేంద్ర మంత్రి అమిత్షా తమ పార్టీ నేతలను ఆదేశించారని వివరించారు.
జంతర్మంతర్ వేదికగా 12 BC సంఘాలు ‘BCల పోరుగర్జన మహాధర్నా’ చేస్తున్నారు. కేంద్రం సహకరించకపోతే దేశవ్యాప్తంగా మరో మండల్ కమిషన్ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
ఇక, BCల న్యాయమైన హక్కుల కోసం సంఘీభావంగా చేపడుతున్న ‘BCల పోరుగర్జన’లో విపక్షాలన్నీ భాగస్వామ్యం అవ్వాలని కాంగ్రెస్ MPలు మల్లు రవి, బలరాం నాయక్, చామల కిరణ్కుమార్ రెడ్డి, సురేష్ షట్కర్, అనిల్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో చెప్పారు.
కాగా, మహాధర్నా అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖల నేతృత్వంలో BC, MLAలు రెండు బిల్లులకు మద్దతు కోసం కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీల నేతలను కలవనున్నారు.