కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే నివేదిక పంపాలని అటవీ శాఖ అధికారులను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశించారని BJP, MPలు వెల్లడించారు. BJP రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, MPలు DK అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, G.నగేశ్, రఘునందన్ రావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలు పర్యావరణ, హెరిటేజ్ భూములని తెలిపారు.
హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు ఈ భూములు ఎంతో ప్రయోజనకరమన్నారు. అనేక రకాల ఔషధ మొక్కలు, వివిధ పక్షి జాతులతో ఆ ప్రాంతమంతా అలరారుతున్నదని చెప్పారు. ఇంతటి విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నదని వారు ఆరోపించారు. HCU విద్యార్థులతో పాటు హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కు తెలిపారు. వెంటనే కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని, ఆ భూములను పరిరక్షించాలని కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని అటవీ, పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించారని MPలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నివేదిక అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.