నగరంలోని మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రేమను నిరాకరించిందనే కోపంతో మధురవాడ స్వయంకృషి నగర్లో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ యువతితో పాటు, ఆమె తల్లిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మి మృతిచెందారు. యువతి దివ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాయత్రి ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన యువకుడు నవీన్గా గుర్తించారు. బాధితురాలు డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటుందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని లక్ష్మి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నవీన్ అనే యువకుడు కొంతకాలంగా యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే ఆమె నిరాకరించడంతో కోపంతో ఊగిపోయిన అతడు, యువతి ఇంటికి వెళ్లి కత్తితో ఆమెతో పాటు ఆమె తల్లిపైనా దాడి చేశాడు. తల్లి లక్ష్మి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందగా, యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె గాయత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. వైద్యుల ప్రకారం, ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో 48 గంటల తర్వాత తెలుస్తుందని పేర్కొన్నారు.
ఈ ఘటనలో యువతి కూడా మరణించిందని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, ACP అప్పలరాజు స్పందిస్తూ యువతికి చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే నిందితుడు పారిపోయాడు. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చీ, DCP ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘోర ఘటనతో స్వయంకృషి నగర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.