మైనర్ బాలికను లైంగికంగా వేదించిన కేసులో 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన నాంపల్లిలోని ప్రత్యేక పోక్సో న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికను లైంగికంగా వేధించిన గుట్ల శ్రీనివాస్ కు ప్రత్యేక కోర్టు ఈ శిక్ష విధించింది.
వివరాల్లోకి వెళితే 2023లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికకు గుట్ల శ్రీనివాస్ సెల్ ఫోన్ ఇస్తానని ప్రలోభపెట్టి, నమ్మించి తన వెంట తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, అన్ని ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుడికి జరిమానా, 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది. పరిహారంగా బాలికకి 5 లక్ష రూపాయిలు చెల్లించాలని కోర్టు తీర్పులో పేర్కొంది.
బాలికలను, స్త్రీలను సెక్స్ ఆబ్జెక్టీవ్స్ గా చూసే వినిమయదారీ సంస్కృతి నశించనంతవరకు, స్త్రీ పురుష సంబంధాలలో ప్రజాస్వామిక సంస్కృతి వికసించనంతవరకు లైంగిక అత్యాచారాలు కొనసాగుతూనే వుంటాయని, కేవలం చట్టాలు, న్యాయస్థానాలు విధించే కఠిన శిక్షలు నేర ప్రవృత్తిలో ఎలాంటి మార్పులూ తీసుకురాలేవని సామాజిక చింతనాపరులు అనేక సందర్భాలలో తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసిన విషయాన్ని మనం మరవకూడదు.