ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో అమానుష పరిణామం చోటు చేసుకున్నది. ఈ గ్రామంలో దళితుల్ని అగ్ర వర్ణాలవారు సాంఘిక బహిష్కారం చేశారు. ఈ గ్రామం ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గ పరిధిలో వుండటం విశేషం.
వివరాల్లోకి వెళితే పల్లపు సురేష్ అనే దళిత వ్యక్తి ఈ నెల 16న ఓ అగ్రవర్ణపు ఇంటి వద్ద కరెంట్ పని చేస్తూ ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి మరణించాడు. ఆ దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. చనిపోయిన దళిత యువకుడి కుటుంబానికి నష్ట పరిహారంగా 2.75 లక్షల రూపాల్యిలు ఇవ్వాలని ఊరిపెద్దల సమక్షంలో ఒప్పందం జరిగింది. ఐతే ఈ ఒప్పందానికి కట్టుబడకుండా ‘అసలు మేం ఎందుకు నష్ట పరిహారం చెల్లించాలి? ఏం తప్పు చేశామని మాకు శిక్ష పడాలి?” అంటూ రివర్స్ లో వెళ్లడంతో దళిత సామాజిక వర్గం వారు నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. దానితో దళితుల్ని సాంఘిక బహిష్కారం చేశారు. దళితులకి ఎలాంటి వస్తువులు అమ్మకూడదని, వారిని పనిలోకి పిలవకూడదనీ హుకుం జారీ చేశారు. దీంతో మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళితులు ధర్నా చేయడంతో పాటు ఆర్డీవో మల్లిబాబుకి ఫిర్యాదు చేశారు. ఆర్డీవో మల్లిబాబు, సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీనివాసులు గ్రామంలో పర్యటించారు. దళితుల గ్రామ బహిష్కరణపై మల్లాంలో విచారణ చేపట్టారు అధికారులు.
ఒక దళిత వ్యక్తి ఒక హోటల్ కి వెళితే “మీకు ఏమీ ఇవ్వొద్దని చెప్పారు” అంటూ అతనికి సర్వీస్ నిరాకరించిన oka వీడియో వైరల్ అయింది. అది అతను ఒక్కడికే కాదని, మొత్తం దళిత సామాజిక వర్గానికి అన్వయిస్తుందని కూడా అందులోని హోటల్ వ్యక్తి చెప్పాడు.
ఈ పరిణామం అమానుషం. ఒకవేళ చర్చల ద్వారా ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకోలేకపోతే న్యాయ, చట్ట రూపాల్లో పరిష్కారానికి ప్రయత్నించాలి కానీ సాంఘీక బహిష్కరణ చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఎస్.సి./ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టం కింద నేరం కూడా. తూర్పు గోదావరి జిల్లాలో ఇలాంటి సాంఘిక బహిష్కరణ ఘటనలు సంభవించడం ఇది తొలిసారేం కాదు. గరగపర్రు గ్రామంలో 2017లో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంలో కూడా నాలుగు నెలల పాటు దళితులకు సాంఘిక బహిష్కరణ విధించారు. అలాగే 2023లో కూడా తిరుమలాయపాలెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు సందర్భంలోనే దళితుల్ని సాంఘిక బహిష్కరణకి గురిచేశారు అగ్రవర్ణాల వారు.
భారతదేశంలో ఇంకా కుల ఆధారిత వివక్ష అనేక రూపాలలో కొనసాగుతోందనడానికి మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ ఓ తాజా ఉదాహరణ. భారత రాజ్యాంగం కుల వివక్షను నిషేధించినా, అది సమాజంలోనూ, కొన్ని వ్యవస్థల్లోనూ నిరాటంకంగా కొనసాగుతోంది. కులవ్యవస్థ పరంగా ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతులు వివిధ రకాల వివక్షలకు గురవుతుంటారు.
భారతదేశంలో ఇంకా కుల ఆధారిత వివక్ష అనేక రూపాలలో కొనసాగుతోందనడానికి మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ ఓ తాజా ఉదాహరణ. భారత రాజ్యాంగం కుల వివక్షను నిషేధించినా, అది సమాజంలోనూ, కొన్ని వ్యవస్థల్లోనూ నిరాటంకంగా కొనసాగుతోంది. కులవ్యవస్థ పరంగా ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతులు వివిధ రకాల వివక్షలకు గురవుతుంటారు.
కుల వివక్ష ఇంకా అన్ని సాంఘిక వ్యవస్థల్లోనూ కొనసాగడం సమాజానికి సిగ్గుచేటు. అది విద్యా వ్యవస్థలో, ఉద్యోగాల్లో, గ్రామీణ సామాజిక జీవనంలో, పెళ్లిళ్లలో, మతపరమైన ప్రదేశాల్లో యథేచ్ఛగా కొనసాగుతున్నది. అత్యంత దళిత వ్యతిరేక నేరాల రేటుతో ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వున్నాయి.
డాక్టర్ అంబేద్కర్ వంటి నాయకులు కుల వ్యవస్థను ధ్వంసం చేయడానికే జీవితం అంకితం చేశారు. అనేక సామాజిక ఉద్యమాలు (Dalit Panthers, BAMCEF, Bhim Army) ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. SC/ST Atrocities (Prevention) Act వంటి చట్టాలు ఈ వివక్షను అడ్డుకునేందుకు ఉద్దేశించబడ్డాయి, అయితే అమలులో అంతగా పటిష్టత లేదనే విమర్శలు ఉన్నాయి.
ఏది ఏమైనా ఉప ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో జోక్య చేసుకొని మృతుడి కుటుంబానికి నష్ట పరిహారం ఇప్పించడంతో పాటు, సాంఘిక బహిష్కరణకి పాల్పడినవారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా చూడాలి.