ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన ఇది. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే దక్కింది. ప్రతి విద్యార్థికి విద్యాబుద్దులు నేర్పి.. జీవితంలో ఉన్నతస్థాయి చేరుకునేందుకు అవసరమైన నైపుణ్యం, శిక్షణ అందించే గురువును దైవంతో సమానంగా చూస్తుంటాం. అలాంటి గురువు పట్ల ఓ కాలేజీ విద్యార్థిని నీచంగా ప్రవర్తించింది. తల్లి స్థానంలో ఉన్న మహిళా లెక్చరర్ను కాలేజీ ఆవరణలో తోటి విద్యార్థులు చూస్తుండగా దారుణమైన బూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది.
విద్యార్ధి టీచర్ తో ‘నా ఫోన్ తీసుకున్నావ్.. అది 12 వేలు.. ఫోన్ ఇస్తావా చెప్పుతో కొట్టమంటావా అంటూ’ లెక్చరర్పై తిట్ల దండకం అందుకుంది. అక్కడితో ఆగకుండా లెక్చర్పైకి దూసుకెళ్లింది. టీచర్ ఫోన్ ఇవ్వను అనేసరికి.. ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థిని లెక్చరర్ను చెప్పుతో దాడి చేసింది. లెక్చరర్ వెంటనే ఆమెను అడ్డుకున్నారు.. లెక్చరర్ కూడా విద్యార్థినిపై చేయిచేసుకోవాల్సి వచ్చింది. ఈ గొడవంతా చూసిన కాలేజీలో పనిచేసే మరో ఉద్యోగి వచ్చి అడ్డుకున్నారు. ఈ సీన్ మొత్తాన్ని కొందరు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లెక్చరర్ విద్యార్థిని ఫోన్ తీసుకోవడంతో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థిని ఏకంగా కాలేజీ ఆవరణలో ఫోన్ ఉపయోగించడంతో లెక్చరర్ గమనించి తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది. ఈ ఘటన ఒకటి, రెండు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థిని ఆ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నట్లు సమాచారం.
ఈ వీడియోను కొందరు నెటిజన్లు ట్వీ్ట్ చేశారు. విద్యార్థిని తీరుపై అందరూ మండిపడుతున్నారు.. ఫోన్ కోసం మరీ ఇంత దారుణంగా ప్రవర్తించాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్లకు బాగా బానిసలుగా మారారనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఏ కాలేజీలోనైనా విద్యార్థులు మొబైల్స్ తీసుకురావడం నిషేధం.. కానీ ఈ విద్యార్థిని మాత్రం ఫోన్ తీసుకొచ్చింది. వెంటనే లెక్చరర్ తీసుకోవడంతో ఆమెపై చెప్పుతో దాడి చేసింది. తల్లిదండ్రులు కూడా ఫోన్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విద్యార్థిని ఫోన్ కాలేజీకి తీసుకురాకుండా ఉంటే సరిపోయేదని.. గొడవ ఇక్కడి వరకు వచ్చేది కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.