భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో TATA గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) కీలక ప్రకటన చేసింది. భారత్ కు చెందిన విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇకపై ప్రత్యామ్నాయ మార్గంలో విమానాలు నడపనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆ మేర ప్రయాణ సమయం పెరగనుంది. ఎక్కువ ప్రయాణ సమయం కారణంగా టికెట్ ధర కూడా ఆ మేర పెరిగే అవకాశం ఉందని విమానయాన వర్గాలు పేర్కొంటున్నాయి.
ఉత్తర అమెరికా, యూకే, యూరప్, పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చే/ వెళ్లే విమానాలు ప్రత్యామ్నాయ సుదూరపు మార్గంలో ప్రయాణిస్తాయి. ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. గగనతలం మూసివేత మా చేతిలో లేని వ్యవహారం. ఏదేమైనా ఎయిరిండియా ప్రయాణికులు, సిబ్బంది భద్రత మాకు ముఖ్యం” అని ఎయిరిండియా ఎక్స్ పోస్ట్లో పేర్కొంది.
ఇండిగో ట్రావెల్ అడ్వైజరీ: పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ మూసివేతతో తాము నడిపే కొన్ని అంతర్జాతీయ విమానాలపై ప్రభావం పడుతోందని ఇండిగో సంస్థ పేర్కొంది. వీలైనంత తొందరగా గమ్యస్థానాలకు చేర్చడంలో తమ సిబ్బంది ప్రయత్నిస్తారని తెలిపింది. ఒకవేళ మీరు ప్రయాణించబోయే విమానంపైనా దీని ప్రభావం ఉంటే స్టేటస్ చెక్ చేసి తమ వెబ్సైట్ ద్వారా రీ బుకింగ్ లేదా రిఫండ్ను పొందొచ్చని ప్రయాణికులకు సూచిస్తూ ‘ఎక్స్’ వేదికగా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఎయిరిండియా, ఇండిగోతో పాటు స్పైసెట్, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ కూడా అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్నాయి. ఉత్తరాది నగరాల నుంచి పశ్చిమ దేశాలపై వెళ్లే విమానాలపై గగనతలం మూసివేత ప్రభావం పడనుంది.