కాశ్మీర్ లో ఉగ్రదాడి(Terror Attack) నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీ వేదికగా రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా విపక్ష నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీకార చర్యలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏ స్టెప్ తీసుకున్న మా నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని కీలక ప్రకటన చేశారు. ఉగ్రమూకల దాడులను పార్టీలకు అతీతంగా అందరూ ఖండించారని.. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని అన్నారు. కశ్మీర్ లో శాంతియుత పరిస్థితుల కోసం కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు.. ఉగ్రవాదంపై కేంద్రం చేస్తున్న పోరాటానికి తమ మద్దతు కూడా ఉంటుందని టీడీపీ ప్రకటించింది.
దేశ భద్రత విషయంలో అందరం కలిసిగట్టుగా ఉండాలని.. రాజకీయాలకు తావివ్వొద్దని టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. అమాయకులను బలితీసుకున్న ఉగ్రవాదులను అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం ప్రారంభానికి ముందు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపంగా నేతలందరూ నిలబడి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఉగ్రదాడికి దారితీసిన లోపాలు, అవి పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యల గురించి ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోంశాఖ అధికారులు వివరించారు. ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వం వెన్నంటే ఉన్నట్లు అన్ని పార్టీల నేతలు చెప్పారు.