ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రష్యా పర్యటన రద్దైంది. మే 9న మాస్కోలో నిర్వహించే విక్టరీ డే (Victory Day) పరేడ్ వేడుకల్లో ప్రధాని పాల్గొనాల్సి ఉంది. అయితే, ఈ కార్యక్రమానికి మోదీ హాజరుకావడం లేదని క్రెమ్లిన్ తాజాగా వెల్లడించింది. ప్రధానికి బదులు ఆ కార్యక్రమంలో భారత దౌత్య ప్రతినిధి హాజరవుతారని ప్రకటించింది. జమ్ము కశ్మీర్లోని పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని తన రష్యా పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
రెండో ప్రపంచయుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా మే 9న రష్యా విక్టరీ డే పరేడ్ (Victory Day Parade) నిర్వహిస్తుంది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ వేడుకల్లో పాల్గొనాలని రష్యా తన మిత్రదేశాలకు ఆహ్వానం పంపుతోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం పంపింది. అయితే, ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మోదీ తన రష్యా పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.