ఎర్రుపాలెం అమరావతి Railway Line కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో రైల్వే లైన్ పనులను వేగవంతం చేస్తోంది. ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్కు భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 12 గ్రామాల్లో మార్కింగ్ పూర్తయింది. మొదటి దశలో ఎర్రుపాలెం నుండి అమరావతి వరకు 27 కిలోమీటర్ల మేర పనులు చేపట్టనున్నారు. మొత్తం 56.53 కి.మీ మేర రైల్వే లైన్ నిర్మాణం కానుంది. దీనికి కేంద్రం రూ.2,047 కోట్లు ఖర్చు చేస్తోంది.
కేంద్రం ఇప్పటికే నిధులు కేటాయించగా.. అమరావతికి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. తాజాగా అమరావతి మీదుగా నిర్మిస్తున్న కొత్త మార్గం (ఎర్రుపాలెం-నంబూరు రైల్వే లైన్)కు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేశారు. ఈ రైల్వే లైన్లో ఇప్పటికే 12 గ్రామాల పరిధిలో క్షేత్రస్థాయిలో రైల్వే లైన్ వెంబడి వేసే మార్కింగ్ (పెగ్ మార్కింగ్)ను పూర్తిచేశారు అధికారులు. ముందుగా ఈ రైల్వే లైన్లో ఎన్టీఆర్ జిల్లా పరిధితోపాటు తెలంగాణలోని ఎర్రుపాలెం మండల పరిధిలో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈ భూసేకరణ ప్రక్రియ అనంతరం ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు 27 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ మొదటి దశ పనులు చేపట్టనున్నారు.
ఈ కొత్త రైల్వే లైన్ మొత్తం 56.53 కి.మీ ఉండగా.. 8 మండలాల్లోని 22 గ్రామాల పరిధిలో భూ సేకరణ చేపట్టారు. ఏపీలోని గుంటూరు జిల్లాల్లో 199.43 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాలో 334.62 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 333.95 ఎకరాలు, తెలంగాణలోని ఖమ్మం పరిధి ఎర్రుపాలెం మండలంలో 24.24 ఎకరాలు సేకరిస్తున్నారు. ఈ రైల్వే లైన్కు సంబంధించి అవసరమైన భూమిలో ప్రైవేటు భూములు 741.8 ఎకరాలు, ప్రభుత్వ భూములు 98.2 ఎకరాలు, ఇనాం భూములు 52.01 ఎకరాలు ఉన్నట్లు గుర్తంచారు. భూసేకరణ కొలిక్కి వచ్చిన చోట రైల్వేశాఖ త్వరలోనే పరిహారం డబ్బులు డిపాజిట్ చేయనుంది.