ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్ మునీర్ అహ్మద్ పాకిస్తాన్కు చెందిన మినాల్ ఖాన్ అనే మహిళతో వివాహం చేసుకున్న ఘటన వార్తల్లో నిలిచింది. వీరిద్దరూ వీసా సమస్యల కారణంగా 2024 మే 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్లో నికాహ్ చేసుకున్నారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత, మినాల్ 2025 మార్చి 1న 15 రోజుల వీసాతో అటారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించింది. మునీర్ కుటుంబ సభ్యులు ఆమెకు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.
ఐతే మునీర్ మినాల్ ఖాన్ ని వివాహం చేసుకున్నట్లు సీఆర్పీఎఫ్ కి అధికారికంగా తెలియచేయలేదు. పైగా వీసా గడువు ముగిసినా తరువాత కూడా మినాల్ ఖాన్ భారత్ లోనే ఉండిపోయింది. పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ లో వున్న పాక్ జాతీయులందరూ భారత్ విడిచి తమ స్వదేశం వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మినాల్ వివరాలు బైటికొచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు మునీర్ ను ఉద్యోగం నుండి తొలగించారు. “పాక్ జాఈయురాలితో వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టడంతో పాటు, వీసా గడువు ముగిసినా ఆశ్రయం కల్పించినందుకు ఉద్యోగం నుండి తొలగిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు జాతీయ భద్రతకు విఘాతం కలిగేలా ప్రవర్తించినందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నాం.” అని సీఆర్పీఎఫ్ ప్రతినిధి వెల్లడించారు.