ఆన్లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11 ద్వారా కోట్లు చేతులు మారుతున్నాయి. ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్ రాయుళ్లు డ్రీమ్ 11పై భారీగా డబ్బు ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కాగా కొందరు అదృష్టం లేక తమ పర్స్ ఖాళీ చేసుకుంటున్నారు. ఇక్కడ పోగొట్టుకున్నవాళ్ళను ఎవరూ పట్టించుకోరు. గెలిచిన వాళ్ళు మాత్రం సెలెబ్రిటీలైపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి నివాసి మంగళ్ సరోజ్ డ్రీమ్ 11 లో టీంను తయారు చేసి 4 కోట్లు గెలుచుకున్నాడు. ఏప్రిల్ 29న అతను డ్రీమ్ 11లో కేవలం 39 రుపాయలతో జట్టును తయారు చేశాడు. ఏప్రిల్ 29న చెన్నై సూపర్ కింగ్స్ , పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ సందర్భంగా మంగళ్ లాటరీ గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుయ్యాడు. సచిన్ గుప్తా అనే యూజర్ సరోజ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. మంగళ్ మాట్లాడుతూ.. గెలిచిన దాంట్లో కొంత మంచి పనులకు వాడుతానని చెప్పాడు. మిగతా అమౌంట్ తో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తానన్నాడు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో డ్రీం 11లో ఇన్వెస్ట్ చేయడం చట్టరీత్య నేరం. కానీ కొన్ని రాష్ట్రాల్లో యథేచ్ఛగా బెట్టింగ్ కి పాల్పడుతున్నారు. ఆ మధ్య డ్రీమ్ 11లో కోటిన్నర గెలుచుకున్న మహారాష్ట్ర ఎస్ఐ సోమనాథ జెండే సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. నిబంధనలకు అతిక్రమించి పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ అతనిపై చర్యలు తీసుకున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకుని యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వారిపై కేసులు కూడా నమోదయ్యాయి.