జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది, ప్రధానంగా పర్యాటకులు, మరణించారు. ఈ దాడిలో భారత నౌకాదళ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా మరణించారు. ఆయన భార్య హిమాన్షి నర్వాల్. ఈ జంట వివాహం ఏప్రిల్ 16న జరిగింది. ఏప్రిల్ 19న విందు ఇచ్చారు. అనంతరం ఈ జంట హానీమూన్ కోసం కాశ్మీర్ వెళ్లారు. ఏప్రిల్ 22న జరిగిన హత్యాకాండలో వినయ్ నర్వాల్ మరణించారు. నిజానికి ఆ కొత్త జంట హానీమూన్ కోసం యూరోప్ వెళ్దామనుకున్నారు కానీ వారికి వీసా సమాస్యలు రావడంతో కాశ్మీర్ వెళ్లారు.
ఈ దాడి తర్వాత ముస్లింలు లేదా కాశ్మీరీయులపై ద్వేషం ప్రదర్శించవద్దని, తాము శాంతిని కోరుకుంటున్నామని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి, ఆమె వ్యక్తిగత జీవితంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయబడ్డాయి.
జాతీయ మహిళా కమిషన్ (NCW) ఈ ట్రోలింగ్ను తీవ్రంగా ఖండించింది. National Commission for Women (NCW) తన X పోస్ట్లో, “లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణం తర్వాత, ఆయన భార్య హిమాన్షి నర్వాల్పై సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలు, ఆమె వ్యక్తిగత జీవితంపై దాడులు దురదృష్టకరం మరియు ఖండనీయం” అని పేర్కొంది. ఒక మహిళను ఆమె అభిప్రాయాలు లేదా వ్యక్తిగత జీవితం ఆధారంగా ట్రోల్ చేయడం ఏ విధంగా సమర్థనీయం కాదని, ఏదైనా అసమ్మతి రాజ్యాంగ హద్దుల్లో మరియు సభ్యతతో వ్యక్తపరచాలని సూచించింది. NCW, ప్రతి మహిళ గౌరవం మరియు హుందాతనాన్ని కాపాడటానికి కట్టుబడి ఉందని తెలిపింది.
ఈ దాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది, ముఖ్యంగా ఉగ్రవాదులు బాధితుల మతాన్ని అడిగి హత్యలు చేసిన విషయం జాతీయ ఆక్రోశానికి కారణమైంది. ఆ ఆక్రోశం బాధితురాలినే టార్గెట్ చేసే స్థాయికి చేరడంతో NCW హిమాన్షి నర్వాల్పై వ్యక్తిగత దాడులను నియంత్రించాలని, శాంతియుత మరియు గౌరవప్రదమైన సంభాషణను ప్రోత్సహించాలని కోరింది.