పహల్గాం ఉగ్రదాడితో భారత్- పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. దేశ భద్రతలో పౌరుల్ని సమాయత్తం చేసేందుకు బుధవారం (మే 7న) మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కొన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. భద్రతా సన్నద్ధతపై పౌరులకు అవగాహన కల్పించాలని, అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో తెలపాలని పేర్కొంది. శత్రు దాడి జరిగినప్పుడు విద్యార్థులు, యువకులు స్వీయరక్షణతో పాటు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలి తెలిపింది.
పాకిస్థాన్ పై భారత్ ప్రతీకార దాడులు చేయొచ్చనే అంచనాలు నెలకొన్న తరుణంలో కేంద్ర హోంశాఖ ఈ తరహా ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. పాక్ సైతం ప్రతిదాడికి దిగితే అందుకు ముందుగానే రాష్ట్రాలను సిద్ధం చేస్తున్నట్లు కనబడుతోంది. శత్రు దేశం దాడి చేస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై సన్నద్ధతా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది. ఎయిర్ రైడ్ హెచ్చరిక సైరెన్ల పనితీరును పరీక్షించాలని ఆదేశించింది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో పౌరులకు తెలపాలని నిర్దేశించింది.
పాకిస్థాన్ కవ్వింపు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్తో పాటు జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఈ సూచనలు చేసినట్లు సమాచారం. ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పలు సూచనలు చేసిన కేంద్రం.. తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మాక్ డ్రిల్స్ ప్రజల స్వీయ రక్షణలో భాగంగా మాక్ డ్రిల్స్ ద్వారా అవగాహన కల్పించడంపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. వైమానిక దాడులు జరిగితే.. ఎలా వ్యవహరించాలి? ప్రజలు ఆందోళనకు గురికాకుండా వారికి ఎలాంటి సూచనలు చేయాలి. సైరన్ ఇచ్చి ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ చేయాలని పేర్కొంది.