సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం (Pakistan Army) జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన భారత జవాన్ ముదావత్ మురళీ నాయక్ (Mudavath Murali Naik) కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. జమ్మూకాశ్మీర్ (Jammu and Kashmir) లోని పూంచ్ జిల్లాలో మురళీ నాయక్ వీరమరణం పొందారు.
శనివారం రాత్రి సత్యసాయి జిల్లాలోని తన నివాసానికి మురళీ నాయక్ పార్థివదేహం చేరింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మురళీ నాయక్ నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత డబ్బులో రూ.25 లక్షలను మురళీ నాయక్ కుటుంబానికి ఎక్స్గ్రేషియాగా చెల్లించనున్నట్లు ప్రకటించారు. మురళీ నాయక్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తాజాగా ఏపీ సర్కారు మురళీ నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అదేవిధంగా ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, ఇంటి నిర్మాణం కోసం 300 చదరపు గజాల స్థలం కేటాయించనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.