పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో మే 13, 2025న జరిగిన దాడిలో అల్ ఖైదాతో అనుబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (JNIM) ఉగ్రవాద సంస్థ 100 మందికి పైగా ప్రాణాలు తీసింది. ఈ దాడి ఉత్తర బుర్కినా ఫాసోలోని డజిబో పట్టణంలో జరిగింది, ఇక్కడ ఉగ్రవాదులు సైనిక స్థావరంతో పాటు పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. మృతుల్లో ఎక్కువగా సైనికులు, స్థానిక కార్మికులు ఉన్నట్లు సమాచారం. JNIM ఉగ్రవాదులు ఎనిమిది ప్రాంతాలను ఏకకాలంలో దాడి చేసి, డజిబోలోని సైనిక శిబిరాలను, ముఖ్యంగా స్పెషల్ యాంటీ-టెర్రరిస్ట్ యూనిట్ క్యాంప్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడి బుర్కినా ఫాసోలో జిహాదీ హింస యొక్క తీవ్రతను మరోసారి హైలైట్ చేసింది. దేశంలో సగం భూభాగం ప్రభుత్వ నియంత్రణలో లేని పరిస్థితిని బహిర్గతం చేసింది.
ఈ దేశంలో ఉగ్రవాదం 2015 తర్వాత తీవ్రమైంది. మాలీ నుండి అల్ ఖైదా అనుబంధ గ్రూపులు వచ్చాయి. JNIM బుర్కినా ఫాసో, మాలీ, నైజర్ ప్రాంతాల్లో అత్యంత క్రూరమైన దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో లక్ష్యం గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా ప్రభుత్వానికి సహకరించే ప్రజలు.
ప్రజల్లో భయాన్ని, అస్థిరతను పెంచడం, ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని చెరిపివేయడం ఉగ్రవాదుల లక్ష్యం.
ప్రస్తుతం బుర్కినా ఫాసోలో సైనిక పాలకులు అధికారంలో ఉన్నారు (2022 నుంచి). ఉగ్రవాదంపై పోరాటంలో తగిన ఫలితాలు కనబడకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో ఫ్రాన్స్ మిలటరీ పాత్ర తగ్గించడంతో భద్రత లోపించింది.