భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా (CJI Sanjiv Khanna) నేడు పదవీ విరమణ చేయనున్నారు. డీవై చంద్రచూడ్ పదవీ విరమణతో ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా 2024 నవంబర్లో ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆరు నెలలు మాత్రమే సేవలందించారు. నేటితో ఆయన పదవీ కాలం ముగిసింది. దీంతో భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ (Justice BR Gavai) రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా.. న్యూఢిల్లీలో 1960, మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్లో న్యాయశాస్ర్తాన్ని చదివారు. ఢిల్లీ హైకోర్టులో 2005లో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత జడ్జి అయ్యారు. 2019, జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పలు ప్రముఖ తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల వినియోగాన్ని ఆయన సమర్థిస్తూ.. అవి పూర్తి భద్రమైనవని, దాని వల్ల బోగస్ ఓట్లు, బూత్ల రిగ్గింగ్ను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. అలాగే ఎలక్టోరల్ బాండ్లపై సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో ఖన్నా కూడా ఉన్నారు. 370 అధికరణ రద్దును సమర్థిస్తూ తీర్చు ఇచ్చిన ధర్మాసనంలో కూడా ఆయన సభ్యుడే.
కాగా తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ పేరును సీజేఐ ఖన్నా ఏప్రిల్ 16న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవాయ్ సీజేఐగా ఆరు నెలలకుపైగా కొనసాగుతారు. 2025 నవంబర్ 23న ఆయన పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ కావడం విశేషం.