దేవదాసు అయ్యగారు స్థాపించిన బైబిల్ మిషన్ చెర్చీలలో వేధికమీద ప్రత్యేకంగా పరిశుద్ధులకు ఒకటీ, పేతురు గారికో యోహానుగారికో మరొకటీ, దేవదాసు అయ్యగారికి మరొకటీ మొత్తం మూడు ఖాళీ కుర్చీలు వేస్తారు.
దాన్ని చూసి నవ్వుతారు లూథరన్ మిషన్, సీ యెస్సై మరియూ మిగతా ఇండిపెండెంట్ చెర్చీల జనాలు.
లూతరన్ మిషన్ లో పుట్టిన ఏడోరోజో, ఎనిమిదో తొమ్మిదో రోజో బిడ్డలకు బాప్తీస్మం ఇస్తారు.
దీన్ని చూసి నవ్వుతారు పెంతెకొస్తూ, ఎల్ ఈ ఎఫ్, భక్తసింగూ తదితర మహిమల సంఘాలు.
వీళ్ళందర్నీ చూసి నవ్వుతారు, విమర్శిస్తారు, దిద్దుబాటు ప్రసంగాలు చేస్తారు, పెద్దపెద్ద బైబిల్ సిద్దాంతాలు విశ్లేషిస్తారు, చరిత్రనూ, సైన్సునూ, రోజువారీ వార్తలనూ కలగలిపి, ఒక్కోసారి సినిమాల్నీ, సీరియల్సునూ ఉదహరిస్తూ క్రిస్టియన్ అపాలెజెటిక్స్ ( దేవుడుండాడా లేడా, బైబిల్ నిజమా అబద్దమా, ఏసు శిలువ వెయ్యబడ్డాడా లేదా, బతికాడా లేదా లాంటి వాదనల్ని లాజికల్ గా చెప్పడం) ప్రసంగాలు చేసే ప్రసంగీకుల సీజన్ 1980 చివర్లో మొదలయ్యింది. కాస్త అటూ ఇటుగానే లేండి…లేదంటే ఈ ఇయర్ తప్పుగా చెప్పాడు కాబట్టి ఇండస్ గాడు చెప్పిందంతా అబుద్దమే అని మొదలు పెడతారు వుంకో అపాలెజెటిక్ వాదన… ఎందుకొచ్చిన సంత.
రవి జకర్యాస్ అనీ… పేద్ద ఇవాంజెలిస్టులేండీ. దేవుడి ఉనికినీ, అందునా క్రీస్తు సిద్దాంతాన్నీ సత్యం అని నిరూపించడానికి ఆయన అపాలెజెటిక్స్ మార్గాన్ని బాగా ప్రచారం చేశాడు.
అంటే … దేవుడు సృష్టిని చేశాడని మేమంటే మరి దేవుడ్ని ఎవుడు సృష్టించాడు అని అడుగుతారు కదా హేతువాదులు , మరి విశ్వం మొదట్లో మ్యాటర్ ఉండేది అని వాళ్ళు చెప్పేదాని ప్రకారం అసలు మొదట మ్యాటర్ యాడ్నుంచి వొచ్చిందీ అని అడగటం.
లేదా … కోతి నుంచి మానవుడు వొచ్చాడని హేతువాదులు వాదిస్తారుగందా మరి ఈ నలభై యాభై వేల ఏళ్ళలో ఏ కోతి అయినా మనిషిగా మారిందా … అని నిలదీయటం.
ల్యాకపోతే చివరాఖరు ల్యాస్టుకు … దేవుడున్నాడని నేనంటున్నాను. లేడు అని నువ్వు నిరూపించు అని తగులుకోటం అన్నమాట.
అర్ధమయ్యింది కదా … అదీ వరస. ఇసుమంటి పాయింట్లను పొష్టుపొష్టు అందిచ్చిన ఇవాంజెలిస్టు మన రవి జకర్యాస్ గారే అన్నమాట.
ఆయనకు అప్పుట్లో సవాలక్షమంది ఫాలోవర్స్ ఉండేవారు. ఆయన పుస్తకాలను విరివిగా సదివేసి అందులోని లాజిక్కు (??????) ను బాగా చీకి అరిగిచ్చుకుని ఇక ఉజ్జాగం సజ్జాగం అనే మాటల్ని అవకాడ పార్నూకి స్టూడెంట్ల మజ్జన ఏసయ్య సువార్త చెప్పే పనికి బయలెల్లిన యంగ్ అండ్ యనర్జెటిక్ ఇవాంజెలిస్టుల్లో ఫ్రాన్సిస్ పురుషోత్తం, ఎడ్వర్డ్ విలియం కుంటం, గంటెల ప్రకాష్, మొండితోక సుధాకర్ …. వీళ్ళందరి అభిమానిగా నేనూ .. నాలాంటి వేలాది యూత్తూ…. అబ్బో అప్పుట్లో సందడి సందడిగా ఉండేది.
రవి జకర్యాస్ పుస్తకం చేత్తోపొట్టుకుని బైబిల్ స్టడీకి హాజరు అవ్వటం వేరే లెవిల్ టెస్టిమోనీ అన్నమాట. భక్తుల్లో సదూకున్న భక్తులు ఒక లెవిలైతే , ఆళ్ళల్లో రవి జకర్యాస్ ఫాలోవర్స్ జస్ట్ పీక్స్ అన్నమాట.
ఉప్పుడు మనం రవి జకర్యాస్ గారి గురిచ్చి నాలుమాటలు గ్యాపకం చేసుకుందాం. … నీతిమంతుని జ్ఞాపకం చేసికొనుట ఆశీర్వాదకరం అంకి బైబిల్ మనకు శలవిచ్చింది కదా…
రవి జకర్యాస్ గారు చెన్నైలో క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఆనక కెనడా దేశం వలస పోయారు. పెద్ద చదువులూ, గొప్ప క్రైస్తవ ఇవాంజెలిస్టులతో స్నేహం పిమ్మట రవి జకర్యాస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ( ఆర్ జడ్ ఐ ఎం) అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ మూల సూత్రం ” హెల్ప్ థింకర్స్ బిలీవ్ అండ్ బిలీవర్స్ థింక్ ” (ఆలోచనాపరులకు దేవునియందు నమ్మిక కలిగేటట్టు చెయ్యడం, నమ్మినవారిని ఆలోచించేటట్టు చెయ్యడం).
కాలంతో పాటు డెబ్బై దేశాల్లో ఆయన తన ప్రసంగ ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రపంచ ప్రఖ్యాత ఇవాంజెలిస్టు బిల్లీ గ్రాహం సభల్లో మాట్లాడే అవకాశం ఇచ్చారు. తిరిగి భారత దేశంలో అనేకమంది మేధావుల్నీ, నాలాంటి వారి ఫాలోవర్స్ నీ తయారు చేసుకున్నాడూ. నేను పైన చెప్పిన , ఇవాళ్ళ తెలుగు క్రైస్తవ సమాజంలో ఒకలాంటి విధ్యాధిక స్పర్శతో ఇవాంజెలిజం చేస్తున్న నాయకుల జీవితాల్ని ప్రభావితం చేశాడు.
దేవుడు లేకుండా మనిషి జీవించగలడా
ఏసూ మరియూ ఇతర దేవుళ్ళు
హేతువు మరణం
ఇలాంటి పాతిక పుస్తకాలు రాశారు. టైటిల్స్ చూస్తేనే మీకు అర్ధం అవుతుంది … ఎంత హేతుబద్దంగా క్రైస్తవం, క్రీస్తూ అనే సిద్ధాంతాలను వివరించడానికి ప్రయత్నించాడో.
ఈ అపాలజెటిక్స్ విజయం అంతా ఎత్తుగడలోనే ఉండేదని నాకు తర్వాతర్వాత అర్ధం అయ్యింది.
ఉదాహరణకు …
అప్పట్లో ఎడ్వార్డ్ విలియం అన్న ఒక ప్రశ్న వేసేవాడు.
ఈ హేతువాదులంతా ‘ దేవుండున్నాడా, ఉంటే చూపించూ ‘ అంటారుగందా వాళ్ళకు నాదో ప్రెశ్న… మీకు మెదడుందా, వుంటే చూపించూ !
ఇలా కాస్త జోకుపూరితమైన ప్రసంగాలూ, మజ్జమజ్జలో రేయ్… ఎవడ్రా నువ్వూ, ఆ దేవదేవుడ్ని ప్రశ్నించే తెలివి నీకు ఇచ్చింది కూడా అదే దేవుడురా ‘ అంటూ విరుచుకు పడిపోవడాలు ఉండేవి. అదంతా నాకూ, నాలాంటి పుట్టు క్రైస్తవ, కన్వర్టెడ్ క్రైస్తవ యూత్తుకు బాగా ఆసక్తికరంగానూ, ఉత్తేజభరితంగానూ ఉండేది. నాయసుంటి నడమంత్రం మడుసులు ఉంకో అడుగు ముందుగూ పక్కకూ వేసి ‘ విశ్వం బిగ్ బ్యాంగునుండే పుట్టిందీ, సదరు బ్యాంగును ఆదేశించిందే దేవుడూ, ఆబ్యాంగు శబ్ధమే వాక్కు,(అచ్చం ఓకారం థియరేలాగన్నమాట) అందుకే ఆదియందు వాక్కు ఉండెను అని బైబూల్లో ఓపెనింగ్ సెంటెన్స్ లోన్నే రాశారు, కిండెలు పడమాకండి నాస్థికుల్లారా అని చిన్నా చితకా ప్రసంగాలు చేసేవోళ్ళం.
మా చెర్చీలో నేనూ, నాయసుంటి స్టైలిష్ యూత్తు విరివిగా ఉండేవాళ్ళం. మాకు యమాబాగా ఇంద్లీషు వొచ్చేది. సదివేదిగూడా స్పెషల్ ఇంగ్లీషు. చేతుల్లో రవి జకర్యాస్ ఇంగ్లీషు పుస్తకాలు. లేటెస్ట్ ఫ్యాషన్ గుడ్డలు. మిగతావోళ్ళంతా చిరంజీవి డ్యాన్సూ, దివ్యవాణి తడిసిన శారీ గురిచ్చి మాట్టాడుకునే రోజుల్లో మేవు విశ్వారంభం, పోస్టుమార్టం రిపోర్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ , జ్యూఇష్ ట్రెడిషన్స్ గురిచ్చి మాట్లాడేవాళ్ళం.
అసలు ఏసయ్య ఆరోజు సముద్రం తీరంలో ప్రసంగం చేత్తంటే అన్నేసి వేలమంది వొచ్చి మీదపడిపోతంటే తప్పిచ్చుకోటానికి నావలో ఎక్కి కాస్తంత లోపలికి పోయి ఒడ్డున ఉన్న జనాలను ఉద్దేశించి ప్రసంగం చేశాడు అని నమ్మే మిగతా క్రైస్తవులకుమల్లే కాకుండగా ‘ ఆయన గొప్ప సైంటిస్టూ, నావలో నీళ్ళమీద నుండి మాట్లాడినప్పుడు శబ్ధం నీళ్ళమీద రిఫ్లెక్ట్ అయ్యి యాంప్లిఫై అవుతుంది. కావాలంటే ఏరు దాటే పడవల్ని గమనించమండి. అందులోనుండీ మాట్లాడీన మాటలు నడి ఏరునుండీ కూడా ఒడ్డునవున్న వాళ్ళకు స్పష్టంగా వినబడతాయి ( ఇది నిజమే) అని థియరీలు చేసేవోళ్ళం.
అంటే కొంత సత్యానికి కొంత అద్భుత కల్పన జోడించి రక్తి కట్టించేవాళ్ళం.
కట్ చేసే ….
రవి జకర్యాస్ గారు 2020 లో మరణించారు. అందర్లానే …!
అదికాదు మ్యాటరు.
ఆయన చనిపోయాక స్వయానా ఆయన కూతురు ఆయన కాండక్ట్ మీద అనుమానాలు వెలిబుచ్చారు.
ఆర్ జడ్ ఐ ఎం ఒక స్వతంత్ర పరిశోధనకు ఆదేశాలు ఇచ్చింది. ( ఇదే క్రైస్తవ సంఘాల అసలైన నిజాయితీ)
నిజాలు
1. ఆయనకు సొంతంగా మసాజు స్పాలు ఉండేవి
2. మసాజు స్పాలలో, మరియూ ‘ ప్రయాణాలలో ‘ ఆయన లైంగిక విశృంఖలత్వానికి పాల్పడేవాడు
3. సంస్థ ఆస్థుల్నీ, ధనాన్నీ ఒక పద్దతిప్రకారం దారిమళ్ళించి సొంత విలాసాలకూ, కుటుంబ ఐశ్వర్యాన్ని పెంచుకోడానికీ ఉపయోగించేవాడు.
4. ఇదతా ఆఖర్లో కాకుండా, ఆయన సిద్దాంతాలూ, ప్రసంగాలూ మంచి ఉచ్చ స్థితిలో ఉన్నప్పటినుండీ ఈవిధమైన అవతవకలు జరుగుతూనే ఉన్నాయి
క్రైస్తవ లోకం ఉలిక్కిపడింది
నేను పైన చెప్పిన అప్పటి యూత్ లీడర్స్, ఇప్పటి సెన్సేషనల్ ప్రీచర్స్ ఖంగుతిన్నారు
నాలాంటి ఫాలోవర్స్ తినదానికి మరేమీ లేక బకరాగళ్ళం అయ్యామని గుర్తించాము
గుర్తించడానికి ఇష్టపడనీ, ఇదంతా నిజమేనని తెలిస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించిన జనాలు, పాస్టర్లూ ….
‘ ఆత్మీయ ప్రయాణంలో పడిపోవడం సహజం, పడిపోనివాడెవడున్నాడు , ఏసు మినహా ఎవరూ పరిశుద్ధులు కాదు… కాబట్టి అదంతా ఒక పీడకలగా మనం మర్చిపోయి ఏసయ్య మార్గంలో కొనసాగుదాం ‘ అని తీర్మానాలు చేశారు.
కాకపోతే… రవి జకర్యాస్ గారి సమాధిమీద మాత్రం ‘ మంచిపోరాటము పోరాడితిని ‘ అని రాసే ధైర్యం చెయ్యలేదు. ఆయన సమాధి పలకమీద ‘ మార్టైర్ ( హతసాక్షి) ‘ అని రాయలేదు. … అంత ధైర్యం చెయ్యలేదు.
గొప్పగొప్ప క్రైస్తవ ప్రయాణాలు అలా ప్రహసనాలుగా ముగిసిన కథలు ఇంకా ఎన్నెన్నో….
రాయమంటారా ప్రెండ్స్?
డిస్క్లెయిమర్ : నేను ఎవరి వ్యక్తిగత జీవితానికీ తీర్పరిని కాను. నేను నీతిమంతుడ్ని కానేకాను.
Author: Indus