టాస్క్ఫోర్స్ పోలీసు అధికారిని అని బెదిరించి యువకుల నుంచి ఐపీఎల్ క్రికెట్ టికెట్లను లాక్కొని పరారైన వ్యక్తిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండలం పుట్టపాకకు చెందిన వంగూరి రాకేష్ ఈ నెల 5న నగరంలో జరిగే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం స్నేహితులు జి.పవన్, రామకృష్ణతో కలిసి నగరానికి వచ్చారు. మొదట హిమాయత్నగర్ 8, జింఖానా మైదానంలో 8 టికెట్లు కొనుగోలు చేశారు. జింఖానా నుంచి బయటకు వస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వారిని అడ్డగించాడు. తానకు నాలుగు టికెట్లు విక్రయించాలని, రూ.2500 విలువైన టికెట్లకు రూ.5000 చొప్పున చెల్లిస్తానని అతను పేర్కొన్నాడు. అందుకు అంగీకరించిన యువకులు టికెట్లను విక్రయించేందుకు ఒప్పుకున్నారు. మళ్లీ ఆ వ్యక్తి మరో 6 టికెట్లు కావాలని అడిగాడు.
టికెట్లు ఇచ్చేందుకు యువకులు నిరాకరించడంతో వారిని బెదిరించాడు. వారి వద్ద నుంచి మొత్తం 10 టికెట్లు లాక్కొని అమెజాన్ యూపీఐ ద్వారా రూ. 25,000 చెల్లించినట్లు స్క్రీన్ షాట్ చూపాడు. డబ్బు రాలేదని యువకులు చెప్పడంతో అతను వారికి పోలీసు గుర్తింపు కార్డును చూపాడు. తాను టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారినని చెప్పాడు. మీరు బ్లాక్లో టికెట్లు విక్రయిస్తున్నారంటూ ఆ యువకులను బెదిరించాడు. అందరినీ జైలుకు పంపుతానని భయపెట్టి వారిని బేగంపేట పోలీస్ స్టేషన్ సమీపం వరకు కారులో తీసుకొచ్చాడు. మొత్తం 16 ఐపీఎల్ టికెట్లను లాక్కొని యువకుల వద్ద ఉన్న రూ.1700 కూడా తీసుకుని తిరిగి బాధితులను పరేడ్ మైదానం వద్ద దించి అతను వెళ్లిపోయాడు. బాధిత యువకులు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.