నీటిపారుదల శాఖ(ఇరిగేషన్ డిపార్ట్మెంట్) ఈఈ నూనె శ్రీధర్ నివాసం, ఆఫీసు, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులను గుర్తించారు. తెల్లాపూర్లో విల్లా, షేక్పేటలో ప్లాట్, కరీంనగర్లో 3 ఓపెన్ ప్లాట్లు, అమీర్పేటలో కమర్షియల్ బిల్డింగ్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 3 ఇండిపెండెంట్ హౌస్లు, అతనికి సంబంధించి 16 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్టుగా తేలింది. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అవినీతి నిరోధక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తన కుమారుడి పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్లో భాగంగా థాయ్లాండ్లో కోట్లు ఖర్చుపెట్టి జరిపించారు.
భారీగా ఆస్తులు గుర్తింపు : రెండు కార్లు, బంగారు ఆభరణాలతో పాటు బ్యాంకులో భారీగా నగదు నిల్వలు తనిఖీల్లో బయటపడ్డాయి. శ్రీధర్ తన పదవిని అడ్డం పెట్టుకొని భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు అవినీతి నిరోధక శాఖ నిర్ధరించింది. దీంతో శ్రీధర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు అతన్ని అరెస్టు చేసి నాంపల్లి న్యాయస్థానంలో హాజరు పర్చారు. మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాల్సి ఉందని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. కాగా శ్రీధర్ ఎస్ఆర్ఎస్పీ డివిజన్-8లో ఈఈగా(ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పని చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీలకు సంబంధించిన పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘానికి అధ్యక్షుడిగా శ్రీధర్ వ్యవహరిస్తున్నారు.