ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ఆడియో ఫంక్షన్లో విజయ్ దేవరకొండ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఫిర్యాదు చేయడంతో ఆ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్లో జరిగిన ఈ ఆడియో ఫంక్షన్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే, ఇప్పుడు ఇండియా, పాకిస్థాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయి.’ అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని, గిరిజన సమాజాన్ని అగౌరవపరిచే విధంగా ఉన్నాయని గిరిజన సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించింది. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గిరిజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు అశోక్ రాఠోడ్ ఈ నెల 16వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన రాయదుర్గం పోలీసులు, విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.