2030 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యమిచ్చే బిడ్ దాఖలుకు కేంద్ర సర్కారు పచ్చజెండా ఊపింది. దీనిపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ చేసిన ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. కామన్వెల్త్ క్రీడలను నిర్వహించేందుకు గుజరాత్లోని అహ్మదాబాద్ నగరాన్ని భారత సర్కారు ఎంపిక చేసింది. అహ్మదాబాద్లో ప్రపంచ స్థాయి స్టేడియంలతో పాటు సకల సౌకర్యాలతో క్రీడా శిక్షణా కేంద్రాలు ఉన్నాయని తెలిపింది.
ప్రపంచంలోనే అతి పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్లోనే ఉందని కేంద్రం గుర్తు చేసింది. 2023 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చిన నరేంద్రమోదీ స్టేడియంలోనూ ఈవెంట్స్ జరుగుతాయని వెల్లడించింది. కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశం భారత్కు దక్కితే, గుజరాత్ ప్రభుత్వంతో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు, దానికి నిధులను ఇచ్చేందుకూ కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
72 దేశాల క్రీడాకారులు కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొననున్నారు. ఇప్పుడు భారత సర్కారు అనుమతి లభించడంతో, కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యాన్ని ఇచ్చే ఆసక్తిని వ్యక్తం చేస్తూ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ బిడ్ను దాఖలు చేయనుంది. చివరిసారిగా 2010లో దేశ రాజధాని న్యూ దిల్లీ వేదికగా ఈ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. టూరిజం రెక్కలు తొడుగుతుంది.
పీఐబీ ‘అంతర్జాతీయ స్థాయి కలిగిన కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు అవకాశం లభిస్తే, భారతదేశ టూరిజం రెక్కలు తొడుగుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈతరానికి చెందిన ఎంతోమంది యువ అథ్లెట్లు వెలుగులోకి వస్తారు. మరెంతో మందికి ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. అటువంటి గొప్ప క్రీడా ఉత్సవాన్ని నిర్వహించే అవకాశం దక్కడం మన దేశానికే గర్వకారణంగా నిలుస్తుంది. భారతదేశ నైతిక బలం మరింత పెరుగుతుంది. దేశంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించే దిశగా కొత్త అడుగులు పడతాయి’’ అని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఓ ప్రకటనను విడుదల చేసింది.