అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా (Air India) డ్రీమ్లైనర్ విమాన ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని (high level committee) ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ శనివారం వెల్లడించింది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ కమిటీ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను అంచనా వేయనుంది. అంతేకాదు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు, భద్రతా మార్గదర్శకాలను కూడా తనిఖీ చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఓ కఠినమైన ఫ్రేమ్వర్క్ను ఈ కమిటీ ప్రతిపాదించనుంది. అయితే, ఈ కమిటీ స్వతంత్రంగా పనిచేయనుందని.. ప్రస్తుతం ఘటనపై సంబంధిత అధికారుల సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగనుందని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంలో కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. ప్రమాద స్థలంలో రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ భవనం పైకప్పు మీద విమాన శకలాలలో బ్లాక్బాక్స్ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా విమానం తోక భాగంలో బ్లాక్బాక్స్ను అమర్చుతారు. ప్రమాదాల్లో పేలుడు ద్వారా ఉత్పన్నమయ్యే మంటల తట్టుకునేలా, 1100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గంటపాటు ఉన్నా ధ్వంసం కాకుండా వీటిని రూపొందిస్తారు.
ఇందులో విమానానికి సంబంధించిన ఫ్లైట్ డాటా రికార్డర్(ఎఫ్డ్ఆర్) వంటి సాంకేతిక సమాచారం, కాక్పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్) సంభాషణల సారాంశం నిక్షిప్తమై ఉంటుంది. ఇందులో విమానంలోని ఇద్దరు పైలట్ల మాటలు రికార్డవుతాయి. ప్రమాదానికి ముందు వారు ఏం మాట్లాడుకున్నారనేది తెలిస్తే దర్యాప్తు సులభమవుతుంది. బ్లాక్బాక్స్ పక్కనే డీవీఆర్లు ఉంటాయి. విమానంలోని సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డయిన దృశ్యాలు ఇందులో ఉంటాయి. బ్లాక్బాక్స్, డీవీఆర్లోని డాటాని ఫోరెన్సిక్ బృందాలు విశ్లేషిస్తాయి. ఇందులోని సమాచార వివరాలు దర్యాప్తులో కీలక ఆధారాలుగా నిలుస్తాయి.
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు (Air India Plane Crash) చెందిన డ్రీమ్లైనర్ ఫ్లైట్ టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఓ బిల్డింగ్పై కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో 265 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ సంఖ్య ఇప్పుడు 274కు చేరిందని తెలిపారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా.. ఇతరులు 33 మంది ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనలో విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.