ఎయిరిండియా విమానానికి (Air India flight) బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ వచ్చింది. థాయ్లాండ్ (Thailand) లోని ఫుకెట్ నుంచి భారత రాజధాని న్యూఢిల్లీ (New Delhi) కి బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని థాయ్ ఐలాండ్లోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
ఎయిరిండియా విమానానికి (Air India flight) బాంబు బెదిరింపు (Bomb Threat) మెయిల్ వచ్చింది. థాయ్లాండ్ (Thailand) లోని ఫుకెట్ నుంచి భారత రాజధాని న్యూఢిల్లీ (New Delhi) కి బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని థాయ్ ఐలాండ్లోనే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విషయాన్ని థాయ్లాండ్లోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
విమానం గాల్లో ఉండగా బెదిరింపు మెయిల్ వచ్చిందని, దాంతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారుల సూచన మేరకు పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని ఆ ప్రకటనలో తెలిపారు. విమానం అండమాన్ సముద్రం చుట్టూ చక్కెర్లు కొట్టి చివరికి ఐలాండ్లో సురక్షితంగా దిగిందని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఫుకెట్ నుంచి బయలుదేరిన AI 379 విమానంలో మొత్తం 156 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. విమానం ఐలాండ్లో దిగిన వెంటనే సంబంధిత అధికారులు తనిఖీలు చేశారని, అందులో ఎలాంటి బాంబుల జాడ కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారని థాయ్లాండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది.