దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) కీలక ప్రకటన చేసింది. తన అంతర్జాతీయ విమాన సేవలను తాత్కాలికంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వైడ్బాడీ విమాన (widebody aircraft) కార్యకలాపాలను జులై మధ్య వరకూ తగ్గించనున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. సుమారు 15 శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
వైడ్బాడీ బోయింగ్ 777 విమానాల్లో మరింతగా రక్షణ తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. అనేక సంక్లిష్ట సవాళ్ల మధ్య మెరుగైన సామర్థ్యం, ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా తన ప్రకటనలో స్పష్టం చేసింది. బోయింగ్ 777 విమానాల్లో చేపట్టే ఈ ప్రత్యేక తనిఖీల ద్వారా ప్రయాణ భద్రతను మరింత పటిష్టం చేయడమే తమ లక్ష్యమని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా (Air India) సమస్యల వలయంలో చిక్కుకొన్నది. మొన్న జరిగిన విమాన ప్రమాదం ఘటన మరవకముందే ఈ సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో సంస్థ ఎయిర్ ఇండియా విమానాల్లో రక్షణ తనిఖీలు చేపడుతోంది. ఈ క్రమంలో నిర్వహణపరమైన ఇబ్బందులతో గడిచిన ఆరు రోజుల్లో సంస్థకు చెందిన దాదాపు 83 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయినట్లు సమాచారం.