గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్ వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆ ప్రదేశం నుంచి దట్టమైన నల్లటిపొగ అన్ని వైపులకు వ్యాపించింది. విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా.. సాంకేతిక లోపంతో కిందికి పడిపోవడం మొదలైంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1.39 సమయంలో పూర్తిగా కిందకు దిగిపోయి చెట్టును ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ప్రమాదానికి గురైన విమానం వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. ఇది 11 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీ ఉండటంతో.. ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. విమాన కూలిన విషయం తెలియగానే ఫైర్ ఇంజిన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఆ విమానంలో ఉన్నట్లు ఏబీపీ పత్రిక పేర్కొంది.
ఈ ప్రమాదం విషయం తెలియడంతో కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలానికి బయల్దేరారు. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకొన్నారు.
ఈ ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పందించింది. విమానానికి కెప్టెన్గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుండర్ వ్యవహరించినట్లు పేర్కొంది. సుమిత్కు ఎల్సీగా 8,200 గంటలు, కో పైలట్కు 1,100 గంటల అనుభవం ఉన్నట్లు వెల్లడించింది. ఏటీసీ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ విమానం రన్ వే 23 నుంచి గాల్లోకి ఎగిరినట్లు తెలిపింది.
కొద్ది సేపటికే ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏటీసీకి మేడేకాల్ (అత్యవసర కాల్ వచ్చిందని వెల్లడించింది. ఆ తర్వాత కూలిపోయినట్లు పేర్కొంది. మరోవైపు ఎయిర్ ఇండియా కూడా ఎక్స్ వేదికగా ప్రమాదాన్ని ధ్రువీకరించింది. తమ సామాజిక మాధ్యమం, ఎయిస్ఇండియా వెబ్సైట్లో ప్రమాద వివరాలు, అప్డేట్లు ఉంటాయని పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే తదుపరి ప్రకటన వెలువడే వరకు అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో ఫ్లైట్ ఆపరేషన్స్ను సస్పెండ్ చేశారు.