ఆడపిల్ల దుస్తులు లాగడం, వక్షోజాల్ని ముట్టుకోవడం అత్యాచార నేరం కిందకిరాదంటూ అలహాబాద్ హై కోర్ట్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కేసుని సుప్రీంకోర్ట్ సుమోటాగా విచారణ చేపట్టింది. ఆ న్యాయమూర్తి వ్యాఖ్యలు ఏ మాత్రం సున్నితంగా లేవని, అమానవీయంగా వున్నాయని జస్టీస్ BR.గవాయి, జస్టీస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్ ద్విసభ్య ధర్మాసనం హైకోర్ట్ తీర్పు మీద స్టే ఇచ్చింది. హైకోర్ట్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి వివరణ కోరుతూ కేంద్రం రాష్ట్రానికి నోటీస్ ఇచ్చింది.
2021 నవంబర్ లో కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన 11 ఏళ్ల కూతురుతో కలిసి బంధువుల ఇంటి నుండి తిరిగి వస్తుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆ బాలికని తాము దింపుతామని తమ బైకుపై ఎక్కించుకున్నారు. మార్గ మధ్యలో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూ కల్వర్ట్ కిందకి దింపటానికి ప్రయత్నించగా అమ్మాయి కేకలు వేయడంతో అటుగా వెళుతున్నవారు రావడంతో యువకులు అక్కడ నుండి పారిపోయారు. ఈ కేసుపై ఈ నెల 17న అలహాబాద్ హైకోర్టులో విచారణ జరుపుతున్న జస్టీస్ రాంమనోహర్ నారాయణ్ మిశ్రా మహిళల వక్షోజాల్ని తాకడం, వారి దుస్తుల్ని లాగడం అత్యాచారం కిందకి రాదని చెబుతూ కేసుని నిందితులకు అనుకూలంగా తీర్పునిచ్చారు.
అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖామంత్రి అన్నపూర్ణా దేవి స్పందిస్తూ ఈ కేసులో సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకోవాలని కోరారు. అలాంటి తీర్పులు సమాజంలో తప్పుడు సంకేతాల్ని పంపించగలవని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్ సుమోటాగా కేసుని టేకప్ చేసింది.
గతంలో కూడా నాగపూర్ హైకోర్ట్ బెంచ్ (అడ్ హాక్) మహిళా న్యాయమూర్తి ఒక POCSO కేసులో “స్కిన్ టు స్కిన్” లేనందువల్ల దుస్తుల పై నుండి బాలిక వక్షోజాలు పట్టుకోవడం POCSO చట్టం కింద నేరం కాదని తీర్పునిచ్చారు. అప్పుడు కూడా సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకున్నది. ఆ మహిళా న్యాయమూర్తి పదవిని రెగ్యులరైజ్ చేయలేదు. హైకోర్టుల స్థాయిలో ఇలాంటి తీర్పులు రావడం పట్ల న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.