రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. అమరావతిలో Startup ఏరియా నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరుతోంది. ఈ మేరకు సింగపూర్ ప్రతినిధి బృందం రాజధానిలో పర్యటిస్తోంది. నిర్మాణాలను బృందం పరిశీలిస్తోంది. గతంలో రాజధాని అమరావతిలో సింగపూర్ స్టార్ట్అప్ ఏరియా డెవలప్ చేయడానికి సింగపూర్ కన్సార్టియం 1,900 ఎకరాల భూమిని తీసుకుంది. 2015లో అమరావతి రాజధానిగా నిర్ణయించబడిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఖరారులో సింగపూర్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మరోసారి సింగపూర్ బృందం అమరావతికి రావడం ఆసక్తికరంగా మారింది.
అయిదేళ్ల కాలంలో అమరావతిలో మారిన పరిస్థితులు, ఫ్లడ్ కంట్రోల్కు తీసుకుంటున్న చర్యలు, కరకట్ట రోడ్డు, ఉద్దండరాయుని పాలెం, తాళ్లాయపాలెంలోని స్టార్ట్అప్ ఏరియా, IAS అధికారుల టవర్స్, మంత్రుల నివాస సముదాయాలను సింగపూర్ ప్రతినిధి బృందం పరిశీలించింది. ఉండవల్లి సమీపంలోని వరద నియంత్రణ కోసం నిర్మించిన ఫ్లడ్ పంపింగ్ స్టేషన్తో పాటు కృష్ణా కరకట్ట రోడ్డు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సంబంధించిన పనులను సింగపూర్ ప్రతినిధులు చూశారు. మరోవైపు, రాజధానిలోని ఉద్దండరాయునిపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రహదారిని ఆనుకుని నిర్మించబోయే స్టార్ట్అప్ ఏరియాను కూడా పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను CRDA అధికారులు సింగపూర్ బృందానికి వివరించారు.
సీడ్ క్యాపిటల్ నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న దృష్ట్యా ఆ దేశ ప్రతినిధుల బృందం స్థానికంగా పర్యటించింది. రాజధానిలో పర్యటన అనంతరం CS విజయానంద్తో సింగపూర్ ప్రతినిధుల బృందం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో CRDA, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి గతంలోలాగే సింగపూర్ ప్రభుత్వం రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల మూడో వారంలో ప్రధాని మోదీ అమరావతి పనుల రీ లాంచ్కు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నిర్మాణ పనులు వేగం పెరగనుంది. 2027 నాటికి తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.