ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో పశ్చిమాసియా వ్యాప్తంగా గగనతలాలపై ఆంక్షలు విధించడంతో ఇరాన్, లెబనాన్, జోర్డాన్, ఇరాక్లలో విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేయగా, టెహ్రాన్లోని ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు నిలిపివేయబడ్డాయి. శనివారం ఇజ్రాయెల్ టెహ్రాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై బాంబు దాడులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ కూడా తమ బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది.
ఈ ఎయిర్పోర్టుల మూసివేతలతో దాదాపు 10,000 మంది ప్రయాణికులు ఇరాన్తో పాటు పశ్చిమాసియా ప్రాంతాల్లో చిక్కుకుపోయి, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమానయాన భద్రతా నిపుణుడు జాన్ కాక్స్ తెలిపారు.
ఇజ్రాయెల్లో 50,000 మందికి పైగా ప్రయాణికులు విదేశాల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఎయిర్ ఇండియా 16 విమానాలను షార్జా, వియన్నా, జెడ్డా వంటి ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించగా, ఇండిగో వంటి సంస్థలు కొన్ని విమానాలను రద్దు చేశాయి.