సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ జరిగింది. వివిధ సంస్థలకు చేసిన భూకేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించారు. సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీల విడుదలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం, జైళ్లలో సంస్కరణలు తేవాలని నిర్ణయించారు.
ఉద్దానం, కుప్పం రక్షితనీటి సరఫరాకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చేందుకు ఆమోదించారు. 248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు, వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. పోలీసు అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు నిర్ణయించారు.
పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణలపై చర్చించారు. మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్టసవరణకు ఆమోదించారు. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యాలు కల్పించాలని, పరిశ్రమలు, కార్పొరేట్ రంగంలో పనిచేసేందుకు మహిళలకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
రక్షితనీటి సరఫరాకు శ్రీకాకుళంలో రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం, కుప్పం నియోజకవర్గంలో రూ.8.22 కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదల చేయాలని నిర్ణయించారు. పలు సంస్థలకు భూకేటాయింపులు, రాయితీల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదిలో 25 మంత్రివర్గ సమావేశాలు జరిపినందుకు సీఎంకు కేబినెట్ అభినందనలు తెలిపింది.
ప్రతీ జీవోను జాగ్రత్తగా గమనించాలి: తుని రైలు ప్రమాదం కేసు అంశం మంత్రివర్గంలో ప్రస్తావనకు వచ్చింది. ప్రతీ జీవోను జాగ్రత్తగా గమనించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పొరపాటు జరిగాక సరిదిద్దుకోవటం కంటే ముందే జాగ్రత్త పడాలని సూచించారు. ఈ తరహా పరిణామాలు మళ్లీ పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. జరిగిన పొరపాటుకు హోంశాఖ కార్యదర్శి సీఎంకు క్షమాపణలు చెప్పారు.
కేంద్రం నుంచి సానుకూల స్పందన: పోలవరం – బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోందని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కూడా జరుగుతోందని చెప్పారు. అమరావతిలో చేపట్టే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ భవనాల డిజైన్లు చూడాలని పవన్ కల్యాణ్ను సీఎం కోరారు. తిరుపతిలో సినీతారలతో యోగా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఈ నెల 15వ తేదీని ఇందుకు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రతి జిల్లా కేంద్రంలో పీ-4 కార్యాలయం: పీ4 సక్రమ అమలుకు ప్రతీ నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పీ4 విధానం ప్రజల్లోకి మరింతగా వెళ్లేలా చర్యలు ఉండాలని సీఎం సూచించారు. ఈ నెల 12వ తేదీలోగా ప్రతీ జిల్లా కేంద్రంలో ఒక పీ4 కార్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ పైనా ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు. 8 గంటల్లో చేసే పనిని క్వాంటంమ్ కంప్యూటింగ్ వ్యాలీ ద్వారా 12 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చని సీఎం వ్యాఖ్యానించారు. క్వాంటంమ్ వ్యాలీ అందుబాటులోకి వస్తే పనివేగం పెరిగి సమయం కలిసి వస్తుందని వెల్లడించారు.