ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కేంద్రంతో రాష్ట్ర అభివృద్ధి పై చర్చిస్తున్న విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు మణిహారం లాంటి గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రం రూపుదిద్దుకోనుంది. సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి ప్రాజెక్టును పట్టాలెక్కించారు.
ఇటీవల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లినప్పుడు రక్షణమంత్రితో ఈ ప్రాజెక్టు పై చర్చించారు. గత అక్టోబర్ లో ప్రధాని మోడీ నేతృత్వంలోని భద్రతా కమిటీ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా (Krishna District) నాగాయలంక మండలం గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోడీ రానున్నారు. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం డీఆర్డీఓ రూ.15-20వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని 2011లోనే తేలింది. 2017లో భూకేటాయింపులు జరిగినా, మిగతా పనులు నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించగా, శంకుస్థాపనకు తానే వస్తానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు తెలుస్తోంది.