ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రెండు కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు కానుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏలూరు దగ్గరలో ఏర్పాటు కానుంది. గతంలో ఈ రెండు విశ్వవిద్యాలయాల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్లో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటికి అనుబంధంగా స్టడీ సెంటర్లు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లపాటు ఇవి సేవలు అందించాయి. కానీ, ఇటీవల వాటి సేవలను నిలిపివేశారు. ఇప్పుడు వాటిని ఆంధ్రప్రదేశ్కు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం స్టడీ సెంటర్ల గురించి కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అన్ని స్టడీ సెంటర్లను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకువస్తారు. శ్రీశైలం, కూచిపూడి, రాజమహేంద్రవరంలో ఉన్న మూడు పీఠాలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయి. ఇటు ప్రభుత్వం రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 63 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అనుమతులను పునరుద్ధరించింది. రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 63 కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ప్రస్తుత విద్యా సంవత్సరానికి అనుమతులు పొడిగించింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.