కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2024-25లో (Swachh Survekshan 2024-25) ఇండోర్ వరుసగా 8వ సారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఐదు అవార్డులు గెల్చుకుని వావ్ అనిపించింది. స్వచ్ఛ సర్వేక్షన్-2025 అవార్డుల కార్యక్రమంలో ఏపీ నుంచి విజయవాడ, తిరుపతి, గుంటూరు, గ్రేటర్ విశాఖపట్నం (జీవీఎంసీ), రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు అవార్డులు దక్కించుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అవార్డులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి మనోహర్ లాల్తోపాటు రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు, ఆయా కార్పొరేషన్ల అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు అందుకోవడం గర్వకారణమని, ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, సిబ్బందిని మంత్రి నారాయణ హృదయపూర్వకంగా అభినందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛ భారత్ మిషన్పై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించేందుకు ఏపీ సన్నద్ధమవుతోందని, స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రజల సహకారం, అధికారుల అంకితభావం కూడా కీలకమని మంత్రి నారాయణ వెల్లడించారు.
ఇదే సమయంలో తెలంగాణ నుంచి క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ విభాగంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ వ్యర్థాల రహిత నగరం విభాగంలో 7 స్టార్ రేటింగ్ సాధించి, గతంలో ఉన్న 5 స్టార్ రేటింగ్ను మెరుగుపరుచుకుని సత్తా చాటింది. అంతేకాదు ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్ జాబితాలోనూ హైదరాబాద్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఈ సారి మొత్తం అవార్డులు..
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25.. 9వ ఎడిషన్ వేడుక ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. విజేత నగరాలకు అవార్డులను అందజేశారు. ఈ సర్వేలో 4,500కి పైగా నగరాలను 10 ప్రమాణాలు, 54 సూచికల ఆధారంగా పరిశీలించారు. ఈ సంవత్సరం అవార్డులను 4 విభాగాల్లో ప్రదానం చేశారు. ఎ) సూపర్ స్వచ్ఛ లీగ్ నగరాలు, బి) 5 జనాభా వర్గాలలో టాప్ 3 క్లీన్ సిటీలు, సి) ప్రత్యేక వర్గం గంగా నగరం, కంటోన్మెంట్ బోర్డు, సఫాయి మిత్ర సురక్ష, మహా కుంభ్, డి) రాష్ట్ర స్థాయి అవార్డు, ప్రామిసింగ్ క్లీన్ సిటీ ఆఫ్ స్టేట్/యుటి. ఈ ఏడాది మొత్తం 78 అవార్డులు ప్రదానం చేశారు.