అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో 22 ఏళ్ల యువతి, 42 ఏళ్ల వ్యక్తితో వివాహం చేయబోతుండగా భక్తులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
పెళ్లి పీటలపై ఏడుస్తున్న పెళ్లి కూతురుని గుర్తించిన భక్తులు, భద్రతా సిబ్బంది ఆ యువతితో వాకబు చేయగా ఆమె తనకి ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నట్లు చెప్పింది. దాంతో విషయం పోలీసుల వరకూ వెళ్లింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాహాన్ని ఆపు చేసి, వధూ వరులు ఇరువురిని, పెద్దలని పోలీస్ స్టేషన్ కి తరలించారు. వివరాలు సేకరిస్తున్నారు.
ఇటీవలనే రాజమండ్రిలో ఓ స్త్రీ తన కంటే 20 ఏళ్లు పెద్దవాడైన భర్త పట్ల పెంచుకున్న అసంతృప్తితో తన పదో తరగతి క్లాస్మేట్ అయిన వ్యక్తితో మళ్లీ అనుబంధం పెంచుకుంది. ఈ క్రమంలో ఆ అనుబంధం వివాహేతర సంబంధంగా మారి, ఆ సంబంధానికి తన ముగ్గురు పిల్లలు అడ్డుగా వున్నారన్న భావనతో వారిని దారుణమగా హత్యచేసింది. ఇలాంటి వయసు వ్యత్యాసాలతో కూడిన అయిష్టపూర్వక వివాహాలకు ఇలాంటి ఉదంతాలు ఓ హెచ్చరిక.
స్త్రీలు అంతరిక్షంలోకి కూడా సాహస ప్రయాణాలు చేస్తున్న ఈ వైజ్ఞానిక యుగంలో కూడా ఆడపిల్లల్ని గుండెల మీద కుంపటిగా భావించే పురాతన వెనుకబాటుతనపు వ్యవస్థ అవశేషాలు కొనసాగడం దురదృష్టకరం. అయితే అన్నవరంలో పెళ్లి కూతురు ఆవేదనని అర్ధం చేసుకున్న భక్తులు, భద్రతా సిబ్బంది పెళ్లిని ఆపుచేయడం ముదావహం.