2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అందులో భాగంగా ముందుగా విజయవాడలో ఇంటి వద్ద అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు మంత్రి. ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఏఎస్,ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్) రోనాల్డ్ రోస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే. నివాస్, ఐఏఎస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి గౌతమ్, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్, ఐఏఎస్లు హాజరయ్యారు.
ఆపై బడ్జెట్ ప్రతులతో అమరావతిలోని వెంకటాయపాలెం వద్ద టీటీడీ ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 2025-26 బడ్జెట్ ప్రతులను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని , ప్రజలను కాపాడాలని ఈ సందర్భంగా స్వామివారిని మంత్రి వేడుకున్నారు. పూజల అనంతరం బడ్జెట్ ప్రతులతో మంత్రి పయ్యావుల అసెంబ్లీకి బయలుదేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను మంత్రి అందజేయనున్నారు. మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీలో కేబినెట్ సమావేశంకానుంది. బడ్జెట్కు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. మొత్తం రూ.3.24 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను నవంబరులో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ముఖ్యంగా… తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయింపులు జరిగాయి. ‘‘సూపర్ సిక్స్’’లో ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలతో పాటు సంక్షేమానికి భారీగా కేటాయింపులు జరిగాయి. కేంద్ర సహకారంతో వీటిని అమలు చేసేలా పద్దులు రూపకల్పన చేశారు. వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నాటికి 5 లక్షల ఇళ్లను పేదలకు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యం బడ్జెట్లో నిధులు కేటాయించారు. అమరావతి, పోలవరంతో పాటు… వెలిగొండ, వంశధార, హంద్రీనీవా ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు.