2023లో సంచలనం సృష్టించిన అప్సర హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన అయ్యగారు వెంకట సూర్యసాయికృష్ణ సరూర్నగర్లోని వెంకటేశ్వర కాలనీలో నివాసముంటున్నాడు. స్థానికంగా మైసమ్మ దేవాయంలో పూజారిగా ఉంటూనే భవన నిర్మాణ కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య, కూతురు ఉన్నారు. ఇదిలా ఉండగా చెన్నైకి చెందిన కురుగంటి అప్సర (30) తన తల్లితో కలిసి ఇదే కాలనీలో నివాసముంటున్నది. గతంలో పలు సినిమాలు, సీరియల్స్లో చిన్న పాత్రల్లో నటించిన అప్సర ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నది.
పూజారి సాయికృష్ణ పని చేసే ఆలయానికి వచ్చే క్రమంలో అప్సరకు అతడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో తనను వివాహం చేసుకోవాలని అప్సర తరచు సాయికృష్ణపై ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టింది. ఎలాగైనా అప్సరను వదిలించుకోవాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం 2023 జూన్ 3న కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను కారులో తీసుకెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో శంషాబాద్ మండలం లోని సుల్తాన్పల్లి శివారులోని గోశాల వైపు సీసీ కెమెరాలు లేని ప్రదేశానికి చేరుకున్నాడు. కారులోనే గాఢనిద్రలో ఉన్న అప్సర ముఖంపై కారుపై కప్పే కవర్తో ఊపిరి ఆడకుండా చేసేందుకు యత్నించాడు. ప్రతిఘటించడంతో వెంటతెచ్చుకున్న బెల్లం కొట్టే రాయితొ తలపై కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
అప్సర మృతదేహాన్ని కారు బాడీ కవరులో చుట్టి డిక్కీలో వేసుకొని ఇంటి వద్దకు చేరుకున్నాడు. సాయంత్రం మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో సరూర్నగర్ MRO కార్యాలయం వెనుక ఉన్న డ్రైనేజీ మ్యాన్హోల్లో పడేశాడు. అప్సర తల్లి తన కూతురి గురించి ప్రశ్నించగా స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని, తానే శంషాబాద్లో ఆమె స్నేహితుల కారులో ఎక్కించినట్టు నమ్మబలికాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడంలేదని నటించాడు. ఏమీ తెలియనట్టు అరుణతో కలిసి శంషాబాద్ RGIA పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాయికృష్ణ మాట తీరుపై అనుమానం వచ్చి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా. నేరాన్ని అంగీకరించాడు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ట్రాక్ కోర్టు.. నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదు విధించింది.