కేరళలోని ఆశా వర్కర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న పద్ధతిలో నిరసన చేపట్టారు.
తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న జుట్టును కత్తిరించి వారు నిరసనను వ్యక్తం చేశారు. 50 రోజులుగా తాము ధర్నా చేస్తున్నా, సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ తిరువనంతపురంలోని సెక్రటేరియెట్ ఎదుట శిరోముండనం చేసుకున్నారు. పదుల సంఖ్యలో మహిళలు జుట్టు కత్తిరించుకున్నా, మరికొంత మంది ఏకంగా గుండ్లు కొట్టించుకున్నారు. మరి వీరంతా ఎందుకు ధర్నా చేస్తున్నారు, జుట్టు కత్తిరించుకుని నిరసన తెలిపేంత సమస్య ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళలోని ఆశా వర్కర్లు 50 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు.
తాము రోజువారీ గౌరవ వేతనాన్ని పెంచాలని, పోస్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరుతున్నారు. ప్రతిరోజూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అస్సలే పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. అయితే ఆశా వర్కర్లు నిరసన చేపట్టి నేటితో 50 రోజులు కావొస్తుండగా, వినూత్న పద్ధతిలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
మరికొందరు పూర్తిగా గుండ్లు కొట్టించుకుని తమ మనసులోని బాధను ప్రభుత్వానికి అర్థమయ్యేలా చేశారు. ఆపై కత్తిరించుకున్న జుట్టు చేత పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ, రోజుకు కేవలం 232 రూపాయలతో తాము ఎలా బతకాలంటూ ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, సెక్రటేరియెట్ ఎదుటే ప్రాణాలు వదిలేస్తామని వారు వివరించారు.