ఐపీఎల్-2025 టైటిల్ గెలుచుకున్న సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన RCB విజయోత్సవ సంబరాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తాజాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. ఈ ఘటనకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీ అని రియల్ ఫైటర్స్ ఫోరం అనే సామాజిక సంస్థ అధ్యక్షుడు వెంకటేశ్.. కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.
కోహ్లీపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెంకటేశ్ పేర్కొన్నారు. ఆర్సీబీ జట్టు 18 తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన RCB విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అభిమానులు వేల సంఖ్యలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్దకు తరలివచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. ఇలా జరగడం దురదృష్టకరమని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం ప్రకటిస్తున్నామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.