బెంగుళూరు నగర పరిధిలోని వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్లో శ్రీకాంత్ అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భార్యపై బుధవారం ఫిర్యాదు చేశాడు. తమకు ఆగస్టు 2022లో వివాహం జరిగిందని, వర్క్ఫ్రమ్ హోమ్ చేస్తోన్న తనను భార్య నిత్యం వేధిస్తోందని ఆరోపించాడు. జూమ్లో ఆఫీసు మీటింగులకు హజరయ్యే సమయంలో మధ్యలోకి వచ్చి డ్యాన్స్లు చేస్తూ, అకారణంగా దూషించడం వంటివి చేస్తోందని తెలిపాడు. ఆమె కారణంగా ఉద్యోగం పోయిందని, కాపురం చేయాలంటే షరతులు పెడుతోందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె అడిగినంత డబ్బులు ఇవ్వకున్నా, చెప్పింది చేయకున్నా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగుతోందని చెప్పాడు. భౌతిక దాడులకు దిగడమే కాదు, ప్రయివేట్ భాగాలపై దాడిచేసి చంపడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశాడు.
అంతేకాదు తనతో కాపురం చేయాలంటే రోజుకు రూ.5000 ఇవ్వాలంటోందని వాపోయాడు. అలాగే, విడాకులు అడిగితే రూ.45 లక్షలు కావాలని డిమాండ్ చేస్తోందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తూ, నరకం చూపిస్తోందని పోలీసులకు మొరపెట్టుకున్నాడు. పిల్లలను కనేందుకు తిరస్కరిస్తోందని, 60 ఏళ్ల వయస్సులో దత్తత తీసుకుందామని చెబుతోందని పేర్కొన్నారు.
అయితే శ్రీకాంత్ ఆరోపణలను ఆయన భార్య బిందు ఖండించారు. విడాకుల కోసం డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు. తమ వివాహానికి తన తండ్రి రూ.40 లక్షలు ఖర్చు చేశారని, ఆ మొత్తాన్ని తిరిగివ్వాలని మాత్రమే కోరానని చెప్పారు. శ్రీకాంతే తనను శారీరకంగా, మానసికంగా హింసించాడని, వరకట్నం వేధింపులకు గురిచేశాడని ప్రత్యారోపణలు చేశారు.