నిన్న 20 మందికి పైగా సినీ నటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్షర్స్ మీద మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. సరిగ్గ నిన్నరాత్రే బెట్టింగ్ యాప్స్ వలలో చిక్కుకొని లక్షలు అప్పుల పాలై ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువకుడు మరణించాడు.
వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా, మంథని మండలం, విలోచవరం గ్రామానికి చెందిన కోరబోయిన సాయితేజ అనే 25 ఏళ్ల యువకుడు ప్రేమ వివాహం చేసుకొని గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో నివాసం ఉంటూ, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి పది లక్షలకు పైగా అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో మార్చ్ 18న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు హుటాహుటీన కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 20వ తేదీన మరణించాడు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం సాయితేజ మృతదేహాన్ని మంథనికి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా వుండగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన యాంకర్లు విష్ణుప్రియ, రీతు చౌదరీలు నిమిషానికి 90 వేలు చొప్పున ప్రమోషన్ కోసం వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో చెప్పారు. యాంకర్లు, సోషల్ ఇన్ఫ్లూయర్స్ ని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారణ చేస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్ కి అలవాటుపడి ఆత్మహత్యలు చేసుకున్నవారిలో సాయితేజ మొదటివాడుకాదు. బెట్టింగ్ ని నిషేధించనంత కాలం, యాప్స్ ని నిర్మూలించనంత కాలం మరెందరో సాయితేజలు యాప్స్ నిర్వాహకులు, ఆ యాప్స్ ని ప్రమోట్ చేసే నటులు, యాంకర్ల స్వార్ధానికి బలైపోతూనే వుంటారు.