ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గానూ పనితీరు ఆధారిత బోనస్లను ప్రకటించింది. అర్హులైన ఉద్యోగులకు సగటున 80 శాతం చొప్పున బోనస్ చెల్లించనుంది. ఆగస్టు నెల వేతనంతో ఈ మొత్తం చెల్లింపులు చేయనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ మేరకు అంతర్గతంగా సందేశాలు పంపుతోంది. క్యూ1లో మెరుగైన పనితీరు నేపథ్యంలో కంపెనీ ఈ స్థాయిలో బోనస్ను ప్రకటించడం గమనార్హం.
పనితీరు ఆధారంగా ఈ చెల్లింపులు జరగనున్నాయి. లెవల్ పీఎల్4 ఉద్యోగుల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి అత్యధికంగా 89 శాతం బోనస్ చెల్లిస్తారు. అంచనాలు అందుకున్న ఉద్యోగులకు 80 శాతం చొప్పున చెల్లింపులు చేయనున్నారు. అలాగే, లెవల్ పీఎల్5, లెవల్ పీఎల్6 ఉద్యోగులకు 78-87 శాతం, 75-85 శాతం చొప్పున చెల్లిస్తారు. పీఎల్4, పీఎల్5, పీఎల్6 కేటగిరీల్లో ‘దృష్టి సారించాల్సిన’ ఉద్యోగులకు కూడా 80 శాతం, 75 శాతం, 70 శాతం చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు ఇంటర్నల్ మెమోలో ఇన్ఫోసిస్ పేర్కొంది. వ్యక్తిగత బోనస్ లెటర్లను ఉద్యోగుల ఇ-డాకెట్స్లో అప్లోడ్ చేస్తామని పేర్కొంది.
జులై 23న వెలువరించిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్ఫోసిస్ అంచనాలను మించి రాణించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ నికర లాభం 8.7 శాతం వృద్ధి చెంది రూ.6921 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 7.5 శాతం వృద్ధితో రూ.42,279 కోట్లుగా పేర్కొంది. రెండు మెట్రిక్స్లోనూ అంచనాలను మించిన పనితీరును కంపెనీ నమోదు చేసింది.